లక్ష జీతం వస్తున్నా.. డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి!

ఐటీ సెక్టార్‌లో అధిక జీతాలు పొందుతున్నప్పటికీ, చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు జీవనశైలి ఖర్చుల కారణంగా పొదుపు చేయలేకపోతున్నారు. ఆర్థిక నిపుణుల సలహాల ప్రకారం, 'పే యువర్ సెల్ఫ్ ఫస్ట్' విధానం, ఖర్చుల నియంత్రణ, సరైన బడ్జెట్ ప్రణాళికతో నెలకు లక్ష రూపాయల జీతంలో గణనీయమైన భాగాన్ని సులభంగా పొదుపు చేయవచ్చు.

లక్ష జీతం వస్తున్నా.. డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి!
It Salary Savings

Updated on: Feb 26, 2026 | 5:20 AM

ఐటీ సెక్టార్‌లో జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరు అంకెల జీతం వస్తున్నప్పటికీ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల లైఫ్‌స్టైల్‌ కారణంగా వారికి లక్ష రూపాయల జీతం కూడా సరిపోవడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఒకటో తారీఖున లక్ష రూపాయలు అకౌంట్ల పడుతున్నా.. 15వ తారీఖు నుంచి డబ్బులకు ఇబ్బందులు పడుతూ.. అప్పులు చేయాల్సిన పరిస్థితి కొంతమందికి తలెత్తుంది. అయితే నెలకు రూ.1 లక్ష జీతం పొందుతున్న ఉద్యోగులు సరైన లైఫ్‌ స్టైల్‌ను అనుసరిస్తే ఆదాయంలో గణనీయమైన భాగాన్ని సులభంగా పొదుపు చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఆదాయం ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు నియంత్రించకపోతే పొదుపు శాతం తగ్గిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, స్పష్టమైన బడ్జెట్, లక్ష్యాధారిత పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు.

మొదటగా పే యువర్‌సెల్ఫ్ ఫస్ట్ అనే పద్ధతిని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే జీతం వచ్చిన వెంటనే కనీసం 30 నుంచి 40 శాతం మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడికి మళ్లించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. దీనికి ఆటోమేటిక్ SIPలు, రికరింగ్ డిపాజిట్లు లేదా పీఎఫ్ వంటి మార్గాలు ఉపయోగపడతాయి. ఇలా ముందుగానే సేవింగ్‌ను కేటాయిస్తే మిగిలిన డబ్బుతో ఖర్చులు నియంత్రించడం సులభమవుతుంది. ఇంటి అద్దె, ఈఎంఐలు వంటి స్థిర ఖర్చులు మొత్తం ఆదాయంలో 30 శాతాన్ని మించకూడదని నిపుణులు చెబుతున్నారు. అధిక అద్దె ఇళ్లకు మారడం లేదా అవసరం లేని లోన్లు తీసుకోవడం పొదుపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. వీలైతే కార్యాలయానికి దగ్గరలో ఉండే, బడ్జెట్‌కు సరిపోయే నివాసాన్ని ఎంచుకోవడం ఉత్తమ నిర్ణయంగా భావిస్తున్నారు.

లైఫ్‌ స్టైల్ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. తరచూ ఆన్‌లైన్ షాపింగ్, ఖరీదైన గాడ్జెట్లు, అవసరం లేని సబ్‌స్క్రిప్షన్‌లు, ఫుడ్ డెలివరీ అలవాట్లు నెలవారీ ఖర్చులను పెంచుతాయి. నీడ్ వర్సెస్ వాంట్ సూత్రాన్ని పాటిస్తే ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నగదు లేదా యూపీఐ ద్వారా ఖర్చులను ట్రాక్ చేయడం కూడా ప్రయోజనకరం. అత్యవసర నిధి నిర్మాణం కూడా కీలకం. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్‌ను వేరు ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి రక్షణాత్మక పెట్టుబడులు తీసుకుంటే భవిష్యత్ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మొత్తానికి, రూ.1 లక్ష జీతం ఉన్నవారు ఖర్చులపై నియంత్రణ, ముందస్తు పెట్టుబడి అలవాటు, సరళమైన జీవనశైలిని పాటిస్తే తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని పొదుపు చేయడం పూర్తిగా సాధ్యమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us