PMJJBY: రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో..

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం (పీఎం జేజేబీవై) ద్వారా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా లభిస్తుంది. ఇది సామాన్యులకు అందుబాటులో ఉండే పథకం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి, బ్యాంకులు, పోస్టాఫీసులో ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

PMJJBY: రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2లక్షల బీమా.. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో..
Pmjjby

Updated on: Mar 02, 2024 | 6:53 AM

జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరం. అనుకోని ఆపద ఎదురైనప్పుడు కుటుంబానికి తోడుగా ఉండి ఆదుకుంటుంది. ఏదైనా ప్రమాదం జరిగి బీమాదారుడు మరణిస్తే అతడి కుటుంబ సభ్యులను కాపాడుతుంది. ప్రస్తుతం అనేక జీవిత బీమా సంస్థలు వివిధ పాలసీలను అమలు చేస్తున్నాయి. అయితే వాటికి కట్టాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉండడంతో చాలామంది సామాన్యులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో చాలా తక్కువ ప్రీమియంతో సులభంగా పొందగలిగే బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. దాని వివరాలు, అర్హతలు, బీమా కవరేజ్ తదితర విషయాలను తెలుసుకుందాం.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం (పీఎం జేజేబీవై) ద్వారా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా లభిస్తుంది. ఇది సామాన్యులకు అందుబాటులో ఉండే పథకం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి, బ్యాంకులు, పోస్టాఫీసులో ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని 2015 మే నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రభుత్వం సాయంతో ఈ పథకం కొనసాగిస్తున్నారు. లైఫ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐసీ), ఇతర భాగస్వామ్య జీవిత బీమా కంపెనీల ద్వారా ఈ పథకం అందుబాటులో ఉంది.

ప్రయోజనాలు..

పీఎంజేజేబీవై పథకం ద్వారా సభ్యులకు అనేక ప్రయోజనాలు అందుతాయి. ఏ కారణంతోనైనా బీమా దారుడు మరణిస్తే రూ.200000 బీమా కుటుంబ సభ్యులకు అందుతుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. ఈ సొమ్ము కూడా సభ్యుడి బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి ఏటా ఆటోడెబిట్ సౌకర్యం ద్వారా మినహాయించబడుతుంది.

ఇవి కూడా చదవండి

పథకంలో చేరడానికి అర్హతలు ఇవే..

  • పీఎంజేజేబీవై పథకంలో చేరడానికి తప్పని సరిగా 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
  • బ్యాంకు లేదా పోస్టాఫీసులో వ్యక్తిగత ఖాతా కలిగి ఉండాలి.
  • ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్టయితే, అతడికి ఒక బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుంది. ఈ పథకంలో చేరడానికి ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం..

https://www.janasuraksha.gov.in/files/pmjjby/english/applicationform.pdf#zoom=250 లింక్ ను ఓపెన్ చేసి దరఖాస్తు ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. దానిలో తెలిపిన వివరాలన్నింటినీ సక్రమంగా పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలు, పొటోలను జత చేసి మీ బ్యాంకులో లేదా పోస్టాఫీసులో అందజేయాలి. అతడు వాటిని పరిశీలించి మీకు అక్నాలెజ్మెంట్ లేదా స్లిప్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ ఇస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..