Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..

Zomato: దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీనిపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనలు ఏకపక్షంగా తెచ్చినవంటూ వారు ఆరోపిస్తున్నారు.

Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..
Zomato
Follow us

|

Updated on: Apr 16, 2022 | 8:30 AM

Zomato: దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కొత్త ఆహార నాణ్యతా విధానాన్ని తీసుకొస్తోంది. దీనిపై రెస్టారెంట్‌(Restaurants) యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్‌ 18 నుంచి ఏకపక్షంగా ఈ కొత్త విధానం అమల్లోకి వస్తున్నాయి. ఆహార నాణ్యతపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా తనిఖీ చేసి తమ యాప్ లో ఆయా రెస్టారెంట్లను తాత్కాలికంగా నిషేధించనున్నట్లు జొమాటో హెచ్చరించింది. ఈ మేరకు కొత్త విధానాన్ని వివరిస్తూ ఇటీవల రెస్టారెంట్ల యాజమాన్యాలకు జొమాటో ఒక లేఖ రాసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) గుర్తింపు పొందిన థర్డ్‌ పార్టీ సంస్థలు తనిఖీలు నిర్వహించి ఆమోదం తెలిపే వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. పైగా తనిఖీలకు అయ్యే ఖర్చు రెస్టారెంట్లే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

‘కొత్త విధానం వెనకున్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. జొమాటో దీన్ని అమలు చేయాలనుకుంటున్న తీరే ఆందోళనకరంగా ఉంటుందని రెస్టారెంట్లు అంటున్నాయి. తక్కువ బడ్జెట్‌లో నడిచే రెస్టారెంట్లపై ఇది అమానుష చర్యగా మిగిలిపోతుంది. చిన్న చిన్న క్లౌడ్‌ కిచెన్‌లు తమ ఉనికినే కోల్పోతాయి. వినియోగదారుడు పంపిన ఒక ఫొటోను ఆధారం చేసుకొని ఆహార నాణ్యతను కాల్‌ సెంటర్‌లో కూర్చున్న ఓ జొమాటో ఉద్యోగి ఎలా నిర్ణయిస్తారు? తమ రెస్టారెంట్ల నుంచి బయలుదేరే వరకు ఆహార నాణ్యతకు మేం హామీ ఇవ్వగలం. తర్వాత అది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ లేదా వినియోగదారుడి దగ్గరకు చేరాక కలుషితం కావొచ్చు’ అని ముంబయి ఛాప్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (NRAI) అధిపతి ప్రణవ్‌ రుంగ్టా అంటున్నారు.

కొన్నిసార్లు ఇదే రంగంలో పోటీ పడుతున్న ప్రత్యర్థి సంస్థలు పరస్పరం నిందారోపణలు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయని సమోసా పార్టీ సహ-వ్యవస్థాపకుడు దీక్షా పాండే అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కావాలనే ఒక రెస్టారెంటు వాళ్లు మరోదానిపై ఫిర్యాదు చేస్తుంటాయని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో జొమాటో కొత్త విధానం తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. చాలా సందర్భాల్లో ఇలా తప్పుడు ఫిర్యాదులే అందుతుంటాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు రెస్టారెంట్లను మాత్రమే బాధ్యుల్ని చేస్తూ నిషేధం విధించడం ఏకపక్షం అవుతుందన్నారు.

దీనిపై స్పందించిన జొమాటో.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే కొత్త విధానాన్ని తీసుకురావాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆహారంలో పురుగులు, గాజు, ఇనుము వంటి పదునైన వస్తువులు రావడం, ముందే ప్యాక్‌ చేసిన ఫుడ్‌ను అందించడం, శాకాహారం స్థానంలో మాంసాహారం పంపడం, వేరే రకమైన మాంసాన్ని అందజేయడం, పాడైన ఆహారం రావడం వంటి సందర్భాలను దృష్టిలో ఉంచుకునే కొత్త విధానాన్ని రూపొందించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Multibagger Stocks: కేవలం 18 నెలల్లోనే బంపర్ రిటర్న్స్.. రూ. 1లక్షను రూ.18 లక్షలుగా మార్చిన పెన్నీ స్టాక్..

Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!