Upstox Guidelines: నకిలీ వెబ్ సైట్లతో నేరగాళ్ల వల.. పెట్టుబడిదారులూ బీ అలర్ట్..
కొందరు అప్స్టాక్స్ ఉద్యోగులుగా నటిస్తూ అప్స్టాక్స్ ఫెసిలిటీస్ గ్రూప్, అప్స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అకాడమీ వంటి నకిలీ చానెళ్లను నిర్వహిస్తున్నారు. వీటిలో అప్స్టాక్స్ పేరుతో స్టాక్ మార్కెట్లో విద్యా కోర్సులు, సెషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా టైర్ 2, టైర్ 3కి చెందిన ఖాతాదారులు సరైన అవగాహన లేకపోవడంతో ఈ మోసాలకు గురవుతున్నారు.
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పై దేశంలోని ప్రజలకు ఆసక్తి పెరిగింది. వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. రాబడిని పెంచుకునే మార్గాలలో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పేరుతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. వీటిపై అవగాహన తక్కువగా ఉండడంతో చాలామంది మోసపోతున్నారు. ప్రస్తుతం అప్ స్టాక్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల దీని పేరుతో అనేక ఆఫర్లు ప్రకటించి పెట్టుబడిదారులకు మోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని అప్ స్టాక్స్ సంస్థ గుర్తించింది. పెట్టుబడిదారులు మోసాలకు గురికాకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడి పెట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు, కమోడీలు, ఫ్యూచర్లు తదితర అనేక విభాగాలలో అప్ స్టాక్స్ వ్యాపార సేవలను అందజేస్తున్న విషయం తెలిసిందే.
సూచనల జారీ..
ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫారమ్ అయిన అప్స్టాక్స్ తన పెట్టుబడిదారులకు పలు సూచనలు జారీ చేసింది. పెరుగుతున్న ఏఐ టెక్నాలజీతో కొందరు నేరగాళ్లు ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మాదిరిగా వ్యవహరిస్తూ సాధారణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. అప్స్టాక్స్ సైబర్ సెక్యూరిటీ బృందం ఈ స్కామ్ లను గుర్తించింది. నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, యాప్లు, వాట్సాప్ గ్రూప్లు, వెబ్సైట్ల సృష్టించి, విద్యా కోర్సులు, స్టాక్ చిట్కాలు, హామీనిచ్చే రాబడిని అందిస్తామని చెబుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా అప్ స్టాక్స్ పేరుతోనూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పింది.
నకిలీ సోషల్ మీడియా ఛానెళ్లు..
కొందరు అప్స్టాక్స్ ఉద్యోగులుగా నటిస్తూ అప్స్టాక్స్ ఫెసిలిటీస్ గ్రూప్, అప్స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అకాడమీ వంటి నకిలీ చానెళ్లను నిర్వహిస్తున్నారు. వీటిలో అప్స్టాక్స్ పేరుతో స్టాక్ మార్కెట్లో విద్యా కోర్సులు, సెషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా టైర్ 2, టైర్ 3కి చెందిన ఖాతాదారులు సరైన అవగాహన లేకపోవడంతో ఈ మోసాలకు గురవుతున్నారు.
పెట్టుబడిదారుల రక్షణకు చర్యలు..
అప్స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ ఈ విషయంపై స్పందించారు. తమ పెట్టుబడిదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. సురక్షితమైన పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమ అధికారిక ఛానెల్ ద్వారా మాత్రమే లావాదేవీలను నిర్వహించాలని పెట్టుబడిదారులకు సూచించారు. ముఖ్యంగా వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫారమ్ దాని ప్రతినిధులు వినియోగదారులను ఏదైనా లింక్ ద్వారా డబ్బును బదిలీ చేయాలని కోరారన్నారు.
అప్ స్టాక్స్ సూచనలు ఇవే..
- పెట్టుబడి దారులు మోసాల బారిన పడకుండా అప్ స్టాక్స్ కొన్ని సూచనలు చేసింది. వీటిని పాటించడం వల్ల ఇన్వెస్టర్లు స్కామ్ ల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.
- బ్రోకర్ చట్టబద్ధతను తనిఖీ చేయాలి. ఏదైనా వ్యక్తి , ప్లాట్ఫారమ్తో పనిచేసే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయండి. ముఖ్యంగా సెబీ రిజిస్ట్రేషన్, స్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యత్వాన్ని పరిశీలించాలి.
- అయాచిత ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి. ఊహించని కాల్స్, ఇమెయిల్లు, ఎక్కువ లాభాలను వాగ్దానం చేసే మెసేజ్ లను నమ్మకూడదు. అటువంటి వాటిని బ్లాక్ చేయడం మంచిది.
- త్వరిత రాబడిని అందించే బ్రోకర్ల కమ్యూనికేషన్ హ్యాండిల్స్పై చాలా శ్రద్ధ వహించండి. అప్ స్టాక్స్ ఎల్లప్పుడూ తన అధికారిక ఛానెల్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేస్తుంది.
- వ్యక్తిగత సమాచారాన్నిగోప్యంగా ఉంచాలి. తెలియని వ్యక్తులు, అనుమానాస్పద అభ్యర్థనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్ స్టాక్స్ , దాని ఉద్యోగులు సరైన ధృవీకరణ లేకుండా వ్యక్తిగత వివరాలను అడగరు.
- అప్స్టాక్స్ హామీతో కూడిన రాబడిని అందించే స్టాక్ చిట్కాలను పంచుకోదు. కాబట్టి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మోసపూరిత కార్యకలాపాల ఫలితంగా అక్రమంగా జరిగిన లావాదేవీలకు అప్స్టాక్స్ ఎటువంటి బాధ్యత వహించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..