Ayushman Card: మొబైల్ నుంచే ఆయుష్మాన్ భారత్ కేవైసీ పూర్తి చేయొచ్చు.. నిమిషాల్లోనే పని పూర్తి.. సింపుల్ ప్రాసెస్ ఇదే..
మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా... అయితే ఈకేవైసీ పూర్తి చేయాలి. లేకపోతే సేవలను పొందటంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మీరు ఆన్ లైన్ ద్వారా సులువుగా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆధార్ ఓటీపీ ద్వారా ప్రాసెస్ జరుగుతుంది. అదెలా అనేది చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలకు రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయినా ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్లో చేరిన నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ సమీపంలో ఏయే ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం ఉందనేది ఆయుష్మాన్ భారత్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆస్పత్రుల లిస్ట్ మొత్తం మీరు తెలుసుకుని అక్కడికి వెళ్లి సేవలు పొందవచ్చు. అయితే మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగి ఉంటే కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ ఇంటి నుంచే మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం.
మొబైల్ ద్వారా కేవైసీ ఎలా పూర్తి చేయాలి..?
ఆయుష్మాన్ భారత్ యాప్లోకి లాగిన్ అవ్వడం ద్వారా మీ వివరాలు నమోదు చేసి ఆధార్ ఓటీపీ ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. మీరు ఇందుకోసం ఆస్పత్రులు లేదా కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ ద్వారా ఆయుష్మాన్ భారత్ యాప్ ఉపయోగించి నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. లబ్దిదారులు స్వయంగా యాప్ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు. ముందుగా మొబైల్ నెంబర్ ద్వారా యాప్లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం మీ రాష్ట్రం, జిల్లాలను ఎంచుకోండి. మీ పేరు, కుటుంబసభ్యుల వివరాలు అక్కడ కనిపిస్తాయి. అక్కడ ఎవరి కేవైసీ పెండింగ్లో ఉందనేది కనిపిస్తుంది.
కేవైసీ ఎలా చేయాలంటే..?
-ఆయుష్మాన్ భారత్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి
-యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి
-మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి
-ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ నెంబర్, ఫ్యామిలీ ఐడీ ద్వారా పేరును వెతకండి
ఈకేవైసీ పెండింగ్ డీటైల్స్ కనిపిస్తాయి
-ఆ సభ్యుని పేరు పక్కన ఉన్న కేవైసీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
-ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు
-అనంతరం లైవ్ ఫొటో, ఇతర సమాచారం అందించండి
-అనంతరం సమాచారం మొత్తాన్ని సమర్పించండి
-ఆ తర్వాత కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది
ఈకేవైసీ ఎందుకంటే..?
ఇ-కేవైసి పూర్తి చేయడం ద్వారా గుర్తింపు సమాచారం ధృవీకరించబడుతుంది. దీనివల్ల పథకం ప్రయోజనాలు సరైన వ్యక్తికే అందుతున్నాయని నిర్ధారించబడుతుంది. మీరు ఆయుష్మాన్ యోజన లబ్ధిదారులై ఉండి మీ ఇ-కేవైసి ఇంకా పెండింగ్లో ఉన్నట్లయితే దానిని పూర్తి చేయడం ఉత్తమం. ముఖ్యంగా మీరు మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఇంటి నుండే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
