
Vande Bharat: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శాఖ తీపి కబురు అందించింది. కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ నుండి బెంగళూరు మీదుగా ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి నూతన ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలును ప్రారంభించాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఓ ఎంపీ అభ్యర్థన మేరకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదనతో ఏపీలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. శివమొగ్గ పట్టణం, తిరుపతి మధ్య బెంగళూరు మీదుగా కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ నడపాలన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అభ్యర్థనకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. ఈ సర్వీసు కోసం అధికారిక ప్రతిపాదనను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
తిరుపతి నుంచి రైలు అనుసంధానాన్ని విస్తరించి, మెరుగుపరచాలన్న ఎంపీ అభ్యర్థన మేరకు నైరుతి రైల్వే రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో ఈ ప్రతిపాదనను చేర్చారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నందుకు రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓకు గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, మిగిలిన లాంఛనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్వరలోనే ఈ సేవను ప్రారంభించాలని అధికారులను కోరారు.
ప్రతిపాదిత రైలు తిరుపతి, శివమొగ్గ, బెంగళూరు మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, తద్వారా యాత్రికులకు, అలాగే విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, ఇతర ప్రయోజనాల కోసం ప్రయాణించే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
కర్ణాటకలోని శివమొగ్గ, బెంగళూరు పరిసర ప్రాంతాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. అలాగే ఉన్నత విద్య, వైద్య సేవలు, ఉద్యోగాలు, వ్యాపార నిమిత్తం బెంగళూరు, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి అత్యంత వేగవంతమైన, సుఖవంతమైన రవాణా సౌకర్యం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్.. మారిన సిలిండర్ బుకింగ్ నిబంధనలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి