హైదరాబాద్: తెలంగాణ స్టేట్ లో యువ ఓటర్ల నుంచి మంచి స్పందన లభించిందని, ఓటు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 70 శాతం వారివేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కోసం 27.31 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు పది లక్షలు పరిష్కరించినట్టు చెప్పారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లా, నియోజకవర్గ ఎన్నికల అధికారులకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణను బుధవారం ఆయన ఇక్కడి హరితప్లాజాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటివరకు పరిశీలించిన దరఖాస్తుల్లో 70 శాతం వరకు యువ ఓటర్లే ఉన్నారు. ఇప్పటికే పరిష్కరించిన వాటి ప్రకారం ఏడు లక్షల మంది యువత తొలిసారి ఓటు హక్కు నమోదు చేసుకుంది. మొత్తంగా 12 లక్షల మంది వరకు నమోదవుతారని అంచనా వేస్తున్నాô. ఇటీవల కాలంలో ఇంత స్పందన ఎప్పుడూ రాలేదు. ఈ నెల 22వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తాం. సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ రూల్స్ ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులంతా సర్టిఫికేట్ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అందుకే రెండు రోజుల శిక్షణ ఇస్తున్నాం. శిక్షణకు హాజరు కాని, ఉత్తీర్ణులు కాని వారికి ఈ నెల 20, 21 తేదీల్లో దిల్లీలో శిక్షణ ఉంటుంది’’ అని రజత్కుమార్ వెల్లడించారు.