CM Jagan: వలస కూలీల కోసం భారీ ఏర్పాట్లు… ఏపీ సర్కార్ తాజా నిర్ణయం
లాక్ డౌన్ ప్రభావం దేశంలో అన్ని వర్గాలపై తీవ్రంగానే వుంది. ఇంటి పట్టున వుంటూ దొరికింది తింటూ ప్రజలు వుంటుండగా.. ప్రభుత్వాలు వారికి చెంతకు నిత్యావసర వస్తువులను చేరవేస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.
Jagan govt made extensive arrangements for migrating labor: లాక్ డౌన్ ప్రభావం దేశంలో అన్ని వర్గాలపై తీవ్రంగానే వుంది. ఇంటి పట్టున వుంటూ దొరికింది తింటూ ప్రజలు వుంటుండగా.. ప్రభుత్వాలు వారికి చెంతకు నిత్యావసర వస్తువులను చేరవేస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటికి వేలాది కిలోమీటర్ల దూరంలో పనులను, ఉపాధిని వెతుక్కుంటూ వెళ్ళిన లక్షలాది మంది వలస కూలీల పరిస్థితి దీనావస్థను చేరుకుంది. లాక్ డౌన్ ప్రకటించిన వారం రోజుల దాకా వలస కూలీలు వందలాది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. రోడ్లమీద వేలాది సంఖ్యలో కనిపించిన వలస కూలీల అవస్థలను చూసి యావత్ దేశం కంటతడి పెట్టిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో వలస కూలీల సంగతి చూడాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో సుప్రీంకోర్టు కూడా కేంద్ర, రాష్ట్రాలకు నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోను వలస కూలీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మొదలైంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వలస కూలీల కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం వలస కూలీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏపీ వ్యాప్తంగా 393 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వాటిలో 21 వేల 25 మందికి వసతి కల్పించారు. వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంప్లను సందర్శించి వారితో మాట్లాడుతున్నారు నోడల్ అధికారి పీయూష్కుమార్. ఈ శిబిరాలలో ఏపీకి చెందిన వలస కార్మికుల సంఖ్య పన్నెండు వేల 820 కాగా.. మిగిలిన 8 వేల 205 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా అధికారులు లెక్క తేల్చారు. ఈ శిబిరాలలో వలస కూలీలకు సేవలందించేందుకు 95 ఎన్జీవో సంస్థలు పని చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో శిబిరాల్లో వారికి పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నారు అధికారులు.