ఆగస్టు నుంచి గ్రామాల పర్యటన.. వెల్లడించిన సీఎం
కరోనా ప్రభావం, లాక్ డౌన్ అమలు కారణంగా నిలిచిపోయిన జిల్లాల పర్యటనలను ఆగస్టు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆగస్టు నెల నుంచి జిల్లాల్లో మరీ ముఖ్యంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి గురువారం జరిగిన కేబినెట్ భేటీలో...
కరోనా ప్రభావం, లాక్ డౌన్ అమలు కారణంగా నిలిచిపోయిన జిల్లాల పర్యటనలను ఆగస్టు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆగస్టు నెల నుంచి జిల్లాల్లో మరీ ముఖ్యంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి గురువారం జరిగిన కేబినెట్ భేటీలో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. అయితే, తన పర్యటనలో భాగంగా ప్రజలను కలిసినపుడు సంక్షేమ పథకాలు తమకు చేరలేదని ఎవరూ కామెంట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులదేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరితే ఎలాంటి ఫిర్యాదు రావని, ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఆయన మంత్రులకు హితోపదేశం చేసినట్లు సమాచారం. కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కూడా తన జిల్లాల పర్యటన గురించి ముఖ్యమంత్రి మాట్లాడినట్లు చెబుతున్నారు.
లబ్దిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరగాలని, వైసీపీకి ఓటు వేయని వారికి కూడా ప్రయోజనాలు చేరేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చొరవ చూపాలని ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. ”పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలి. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలి. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి. ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదు.” అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.