క్రికెట్ ఆటలో కత్తిపోట్లు.. “ఢీ అంటే ఢీ”
క్రికెట్ మైదానం ఘర్షణలకు వేదికగా మారింది. ఒకేరోజు రెండు జిల్లాల్లో క్రికెట్ మైదానాల్లో ఘర్షణలు జరగడం కలకలం రేపింది. అటు విశాఖ జిల్లాలో కత్తిపోట్లకు దారి తీయగా, ఇటు ప్రకాశం జిల్లాలో రెండు వర్గాలకు చెందిన యువకులు బ్యాట్లు, స్టంప్స్ కర్రలతో దాడికి దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులోని కాలేజీ క్రికెట్ మైదానంలో జరిగిన ఓ వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. మూలపేటకు చెందిన సాయి, శారదానగర్కు చెందిన సూర్య క్రికెట్ ఆడేందుకు ఈనెల […]

క్రికెట్ మైదానం ఘర్షణలకు వేదికగా మారింది. ఒకేరోజు రెండు జిల్లాల్లో క్రికెట్ మైదానాల్లో ఘర్షణలు జరగడం కలకలం రేపింది. అటు విశాఖ జిల్లాలో కత్తిపోట్లకు దారి తీయగా, ఇటు ప్రకాశం జిల్లాలో రెండు వర్గాలకు చెందిన యువకులు బ్యాట్లు, స్టంప్స్ కర్రలతో దాడికి దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరులోని కాలేజీ క్రికెట్ మైదానంలో జరిగిన ఓ వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. మూలపేటకు చెందిన సాయి, శారదానగర్కు చెందిన సూర్య క్రికెట్ ఆడేందుకు ఈనెల 2న కొత్తూరులోని గ్రౌండ్లో క్రికెట్ ఆడారు. అక్కడ ఓ విషయంలో వివాదం చెలరేగింది. అయితే సహచరులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే సాయిపై కక్ష గట్టిన సూర్య…మరుసటి రోజు అదే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న సాయిపై కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో సాయికి నుదురు, దవడ, ముక్కుతో పాటు అయిదు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా ఓ క్రికెట్ మైదానంలో ఘర్షణ చెలరేగింది. కొండపి మండలం నేతివారిపాలెంలోని క్రికెట్ గ్రౌండ్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. గ్రౌండ్ను బాగు చేసుకుని ఓ వర్గం క్రికెట్ ఆడుతుండగా, మరో వర్గం యువకులు కూడా అదే గ్రౌండ్లోకి ఆడుకునేందుకు రావడంతో గొడవ మొదలైంది. ఓ వర్గానికి చెందిన వారు బ్యాట్లు, స్టంప్స్ కర్రలతో మరో వర్గానికి చెందిన యువకులపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఇద్దరికి తలలు పగిలాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన యువకులు, దాడికి గురైన యువకులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అయితే క్రికెట్ ఆడే విషయంలో గ్రూపులు కట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల వెనుక గ్రూపు తగాదాలు ఉన్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.