ఏపీ రాజధాని రైతులు రాష్ట్రపతి కోవింద్కు లేఖలు రాశారు. తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. అమరావతి రాజధాని విషయంలో మోసపోయామని.. అందుకు ఇక తమకు చావే శరణ్యమని.. కాబట్టి చనిపోయే అవకాశం కల్పించాలంటూ కోరారు. తాజాగా ఏపీకి మూడు రాజధానులంటూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. తామంతా రోడ్డునపడ్డామంటూ తెలిపారు. కొందరి స్వలాభం కోసం.. రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని.. 14 రోజులుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలు చేస్తున్నా.. మా గోడు ఏవరూ వినిపించుకోవడంలేదంటూ లేఖలో రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తే.. మేము బతికి ఉన్నా.. జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని.. ఈ బతుకులు ఇక మాకొద్దంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక మాకు చావే శరణ్యమని.. మా మీద దయతలచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరారు.