ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన దిశ చట్టంపై సామాన్య ప్రజల నుంచే కాదు సెలబ్రిటీల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా..జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థించారు. తప్పు చేస్తే చనిపోతాం అన్న భయం వేస్తేనే, మహిళలపై దాడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో కావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఇటీవలే ‘ వెంకీమామ’ సినిమాలో నటించిన రాశి ఖన్నా మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నటించిన మరో మూవీ ‘ప్రతి రోజూ పండగే’ వచ్చే వారం రిలీజ్ కానుంది.
మరోవైపు పౌర హక్కుల సంఘం నేతలు సైతం ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ గత పన్నెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధానికి లేఖ రాశారు.
దిశ చట్టం ప్రకారం.. మహిళలపై అత్యాచారం, యాసిడ్ దాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి, కేసులు నమోదు తర్వాత త్వరితగతిన విచారణ జరిగేలా, శిక్షలు పడేలా ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని ప్రవేశపెట్టింది. నిందితులపై నేరారోపణకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో 14 రోజుల్లోనే విచారణను ముగించి 21 రోజుల్లోనే..జీవితఖైదు లేదా మరణ శిక్ష విధించనున్నారు.