Vijayawada: మహిళకు మూడు సార్లు కిడ్నీ మార్పిడి.. దాతలంతా కుటుంబ సభ్యులే
కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్లకు దాతలు దొరకడం ప్రస్తుతం చాలా కష్టతరంగా మారింది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళకు మూడు సార్లు కిడ్నీ మార్పిడి శ్రస్త్ర చికిత్స జరిగింది. మహిళను బతికించుకోవడానికి ఇంట్లో వాళ్లంతా కిడ్నీలు దానం చేశారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల గురించి చాలా అరుదుగా వినేవాళ్లం. కానీ మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా కిడ్నీ మార్పిడీలు, కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగాయి. అయితే ఒకసారి కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ల గురించి మీరు విని ఉంటారు. కానీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ మహిళకు ఇప్పటికి 3 సార్లు కిడ్నీ మార్పిడి చేశారు. ఆమె కోసం కుటుంబ సభ్యులంతా కిడ్నీ దానం చేయడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళ(30)కు కిడ్నీ ఫెయిల్ అయింది. దీంతో రెండు సార్లు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. తొలిసారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీలు డొనేట్ చేశారు. అయితే ఆ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. మూడోసారి కూడా కిడ్నీ మార్చాలి అని డాక్టర్లు సూచించారు. దీంతో తండ్రి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాగా.. విజయవాడ నగరంలోని శరత్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి వైద్యులు.. మూడోసారి ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకే మహిళకు మూడుసార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అత్యంత అరుదని ఈ ఆపరేషన్ లీడ్ చేసిన నెఫ్రాలజిస్ట్ శరత్బాబు తెలిపారు. మహిళకు ఏకంగా మూడుసార్లు కిడ్నీ మార్పిడి చికిత్స చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.