
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో… ప్రధాన పార్టీలన్నీ ప్రచార భేరీ మోగిస్తున్నాయి. ఎవరికివారు యుద్దానికి సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో మార్పులు, చేర్పులతో… పొలిటికల్ హీట్ పెంచిన అధికార వైసీపీ… మరింద దూకుడు పెంచింది. సిద్ధం సభలతో ఎన్నికల శంఖారావం పూరించింది. విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించిన తొలిసభలో.. విపక్షాలపై విమర్శలబాణాలు ఎక్కు పెట్టారు సీఎం జగన్. ఎన్నిలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అధికార వైసీపీకి ధీటుగా సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. జనసేనతో జట్టుకట్టిన టీడీపీ.. రా, కదలిరా అంటూ బహిరంగసబలు నిర్వహిస్తోంది. పీలేరు సభలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన చంద్రబాబు… సిద్ధం పేరిట వైసీపీ ఏర్పాటు చేస్తున్న సిద్ధం సభలపై సెటైర్లు వేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఏపీ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఇన్నాళ్లూ లైమ్లైట్లో లేదనుకున్న కాంగ్రెస్ కూడా.. కొత్త నాయకత్వంలో కదనోత్సాహం చూపిస్తోంది. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్లో మళ్లీ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీలో పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న భారతీయ జనతాపార్టీ సైతం… తన శ్రేణులను అలర్ట్ చేసింది. పొత్తుల సంగతి ఇంకా తేలనప్పటికీ… పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేలా కేడర్కు దిశానిర్దేశం చేస్తోంది. మొత్తానికి ఏపీలో పొలిటికల్ బీపీ పెరిగినట్టు కనిపిస్తోంది. ఎన్నికల యుద్ధానికి అంతా సిద్ధమవుతున్న వేళ… మున్ముందు ఈ పోరు ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..