అమరావతిలో దొంగతనాలకు పాల్పడింది వీళ్లేనట.. ఇకపై మొత్తం 8 చెక్ పోస్టులు.. తేడా వస్తే దబిడి దిబిడే..

అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణ సంస్థల గోదాములను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల సహాయంతో ముందుగా రెక్కీ నిర్వహించి, రాత్రివేళల్లో విలువైన సామగ్రిని అపహరిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.11 లక్షల విలువైన టీవీలు, కాపర్ బండిల్స్, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

అమరావతిలో దొంగతనాలకు పాల్పడింది వీళ్లేనట.. ఇకపై మొత్తం 8 చెక్ పోస్టులు.. తేడా వస్తే దబిడి దిబిడే..
Amaravati Warehouse Theft Gang

Edited By:

Updated on: Jul 25, 2026 | 11:49 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధానిలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు. ఇక్కడ నిల్వ చేస్తున్న విలువైన వస్తువులే టార్గెట్‌గా ఒక ముఠా చోరీలకు పాల్పడుతుంది. అటువంటి గ్యాంగ్ తాడేపల్లి పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మంగళగిరిలోని గండాలయ్య పేటకు చెందిన మేకల దుర్గా ప్రసాద్, చలమచర్ల నరసింహ, తుమ్మల వెంకట్, పాలపర్తి ప్రశాంత్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు చిన్న పిల్లల సాయంతో రాజధానిలోని నిర్మాణ రంగ సంస్థల గోడౌన్ లపై రెక్కీ నిర్వహిస్తారు. ఏయే వస్తువులు ఉన్నాయో ముందుగానే పిల్లల సాయంతో పసిగడతారు. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా వాటిని దొంగలిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న చోరీలతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎట్టకేలకు ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేశారు.

వీరిపై ఇప్పటికే తాడేపల్లి పిఎస్ లో ఆరు, తుళ్లూరు పోలీస్‌స్టేషన్లో ఎనిమిది కేసులున్నాయి. వీటితో పాటు కంకిపాడుకు చెందిన పిఎస్ లో ఓ ఇంట్లో చోరి చేసిన కేసు ఉంది. 2024 నుండి ఇప్పటి వరకూ పద్దెనిమిది లక్షల రూపాయల విలువైన సొత్తు అపహరించినట్లు పోలీసుల రికార్డుల్లో నమోదయ్యాయి. వీరి వద్ద నుండి పదకొండు లక్షల రూపాయల విలువైన టీవీలు, బంగారు చెయిన్, 74 కాపర్ బండిల్స్, నేరాలకు ఉపయోగించే ఆటో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఆరుగురు కోసం గాలిస్తున్నామన్నారు. నిందితులపై పిడి యాక్ట్ ప్రయోగిస్తామని ఎస్సీ చెప్పారు.

రాజధాని ప్రాంతంలో ప్రత్యేక నిఘా పెట్టామని నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎనిమిది చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని వాటి వద్ద నిందితుల ఫోటోలు ఉంచుతామన్నారు. అదే విధంగా నిర్మాణ సంస్థల గోడౌన్ల వద్ద కూడా నిందితుల పోటోలను ప్రదర్శిస్తామన్నారు. నిర్మాణ సంస్థలు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసుల నిఘా పెంచడంతో గత నాలుగు నెలల్లో చోరీలు తగ్గాయన్నారు. నిందుతులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us