AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి చిన్న వయసులోనే IAS.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యువ సివిల్‌ సర్వెంట్స్‌ వీరే!

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒకటి. యేటా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే.. చివరకు కొన్ని వందల మందికి మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల్లో చోటు దక్కుతుంది. కొందరు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తారు. మరికొందరు అపజయాలతో నిరాశ చెంది లక్ష్యాన్ని వదిలేస్తారు..

అతి చిన్న వయసులోనే IAS.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యువ సివిల్‌ సర్వెంట్స్‌ వీరే!
Youngest IAS Officers in India
Srilakshmi C
|

Updated on: Sep 07, 2026 | 11:25 AM

Share

కష్టాలను ఎదుర్కొంటూ, పట్టుదలతో ముందుకు సాగి చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన యువత కూడా ఉన్నారు. వారి విజయగాథలు ఎంతోమంది సివిల్స్ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

21 ఏళ్లకే ఐఏఎస్.. అన్సర్ అహ్మద్ షేక్

చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారిలో అన్సర్ అహ్మద్ షేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన అన్సర్.. సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న అన్సర్‌కు ఓ ఘటన సివిల్స్ వైపు మళ్లేలా చేసింది. ప్రభుత్వ ఇంటి పథకానికి దరఖాస్తు చేసిన తన తండ్రిని స్థానిక అధికారి లంచం అడిగినట్లు ఆయన తెలిపారు. ఆ కారణంగా తమకు ఇల్లు దక్కలేదని చెప్పారు. ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే తాను అధికారిగా మారాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు అన్సర్ వెల్లడించారు. పూణేకు వెళ్లి ఫెర్గుసన్ కాలేజీలో చదువుకున్న ఆయన.. యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2016లో తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించి 361వ ర్యాంక్ పొందారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన కథలో కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, అన్నయ్య అందించిన ఆర్థిక సహాయం కీలకంగా నిలిచాయి. పూణేలో వసతి కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అన్సర్ ఓ ఇంటర్వ్యూలలో వెల్లడించారు. మతపరమైన వివక్ష కారణంగా రూమ్ దొరకకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ లక్ష్యం నుంచి మాత్రం వెనక్కి తగ్గలేదని తెలిపాడు.

22 ఏళ్లకే ఐఏఎస్.. తర్వాత సరికొత్త ప్రయాణం

యువ వయసులో సివిల్స్ సాధించిన మరో పేరు రోమన్ సైనీ. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రోమన్ సైనీ చిన్న వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎయిమ్స్‌లో పనిచేసిన ఆయన.. వైద్య వృత్తితో పాటు సివిల్స్ వైపు అడుగులు వేశారు. 2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 22 ఏళ్ల వయసులో మధ్యప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఐఏఎస్ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగకుండా.. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరింత మందికి అందించాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సివిల్స్ సహా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించే దిశగా అడుగులు వేశారు. యువతలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి

22 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన స్వాతి మీనా

మహిళా అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలిచిన యువ ఐఏఎస్ అధికారుల్లో స్వాతి మీనా కూడా ఒకరు. రాజస్థాన్‌కు చెందిన ఆమె 2007లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో 260వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే సివిల్స్ సాధించిన స్వాతి మీనా.. చిన్న వయసులోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించవచ్చని నిరూపించారు. ఆమె ప్రయాణం ఎంతోమంది మహిళా సివిల్స్ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలిచింది.

తొలి ప్రయత్నంలోనే టాప్10లో.. అమృతేష్ ఔరంగాబాద్కర్

మహారాష్ట్రకు చెందిన అమృతేష్ ఔరంగాబాద్కర్ కూడా చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారిలో ఒకరు. 2012లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 10వ ర్యాంక్ సాధించారు. పూణేలో విద్యాభ్యాసం పూర్తి చేసిన అమృతేష్ ఫెర్గుసన్ కాలేజీలో చదివారు. నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డిప్లొమా కూడా చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఐఏఎస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నట్లు ఆయన గురించి అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. నాలుగో తరగతిలోనే ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్న అంకుర్ గార్గ్ 2001లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించి 22 ఏళ్ల వయసులో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన.. చిన్నతనం నుంచే ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. నాలుగో తరగతిలో ఉండగానే తన భవిష్యత్ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సాధారణ స్థాయి విజయంతో సంతృప్తి చెందకుండా మరింత మెరుగ్గా సాధించాలనే ఆలోచనతో ముందుకు సాగారు.

రిక్షా కార్మికుడి కొడుకు నుంచి ఐఏఎస్ వరకు.. గోవింద్ జైస్వాల్

కష్టాలను జయించి సివిల్స్ సాధించిన వారిలో గోవింద్ జైస్వాల్ కథ ప్రత్యేకమైనది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన గోవింద్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. ఆయన తండ్రి రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ప్రమాదంలో తండ్రి కాలు కోల్పోవడంతో కుటుంబ పరిస్థితులు మరింత దిగజారాయి. అయినప్పటికీ తన కుమారుడు చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలనే ఆశతో ఉన్న భూమిని కూడా అమ్మి గోవింద్‌ను ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమవుతూ గోవింద్ ఖర్చుల కోసం మ్యాథ్స్ ట్యూషన్లు కూడా చెప్పేవారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో త్యాగాలు చేస్తూ చదువుకున్నారు. 2006లో 22 ఏళ్ల వయసులో తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్‌లో 48వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్‌గా వచ్చిన తొలి జీతంతో తన తండ్రి కాలుకు చికిత్స చేయించినట్లు ఆయన కథనం మరింత భావోద్వేగాన్ని కలిగిస్తుంది. తండ్రి రిక్షాలో కూర్చుని కలెక్టరేట్‌కు వెళ్తున్న గోవింద్ జైస్వాల్ ఫొటో అప్పట్లో విస్తృతంగా ప్రచారం పొందింది. పేదరికం తన లక్ష్యానికి అడ్డంకి కాదని ఆయన విజయగాథ నిరూపించింది.

తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. టీనా డాబి

2015 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన టీనా డాబి కూడా యువతకు స్ఫూర్తిగా నిలిచిన అధికారుల్లో ఒకరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించిన ఆమె కుటుంబం సివిల్స్ లక్ష్యంతో ఢిల్లీకి మారింది. చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన టీనా.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. 2015లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో అగ్రస్థానాన్ని సాధించారు. ఆమె విజయంతో మహిళా అభ్యర్థుల్లోనూ సివిల్స్‌పై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆమె ప్రజాసేవతో పాటు మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.

కల పెద్దదైతే వయసు అడ్డంకి కాదు

ఈ యువ అధికారుల కథల్లో ఒక్కోరి నేపథ్యం ఒక్కోలా ఉన్నప్పటికీ.. వారి విజయానికి సాధారణంగా కనిపించే అంశాలు మాత్రం పట్టుదల, లక్ష్యంపై స్పష్టత, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం. కొందరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించారు. మరికొందరు వివక్షను ఎదుర్కొన్నారు. ఇంకొందరు తమ కెరీర్‌లోని సౌకర్యాలను పక్కనపెట్టి సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడం అంత సులభం కాదు. అయితే సరైన ప్రణాళిక, నాణ్యమైన మెటీరియల్, నిరంతర సాధన, గత ప్రశ్నపత్రాల విశ్లేషణ, సమయపాలనతో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఒకప్పుడు సివిల్స్‌కు ఎలా సిద్ధం కావాలో తెలుసుకోవడానికి పరిమిత వనరులే ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అనేక విద్యా వేదికలు, వీడియో పాఠాలు, మాక్ టెస్టులు, నిపుణుల మార్గదర్శకత్వం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సరైన వనరులను ఉపయోగించుకుంటూ పట్టుదలతో ముందుకు సాగితే సివిల్స్ కలను సాకారం చేసుకోవచ్చు. ‘కల అనేది నిద్రలో వచ్చేది కాదు.. నిద్రపోనివ్వనిదే నిజమైన కల’ అనే భావనను గుర్తుపెట్టుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. విజయం సాధించే అవకాశాలు మరింత పెరుగుతాయి.

Follow Us