‘ఛలో అంతర్వేది’కి అనుమతుల్లేవు: డీఐజీ

రాజకీయ నాయకులు పిలుపునిస్తోన్న ఛలో అంతర్వేది, ఛలో అమలాపురంకు ఎలాంటి అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్‌రావు స్పష్టం చేశారు

ఛలో అంతర్వేదికి అనుమతుల్లేవు: డీఐజీ

Updated on: Sep 18, 2020 | 11:36 AM

Eluru Range DIG:  రాజకీయ నాయకులు పిలుపునిస్తోన్న ఛలో అంతర్వేది, ఛలో అమలాపురంకు ఎలాంటి అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్‌రావు స్పష్టం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతమైన కోనసీమలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో కోనసీమలో 34, 144 సెక్షన్లు అమలులో ఉన్నాయని, ఎవరూ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేసేందుకు అనుమతులు లేవని ఆయన అన్నారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని, అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ నిపుణుల ఆధారాలు సేకరించామని, ఆధునిక సాంకేతిక పరిఙ్ఞాతంలో నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని కేవీ మోహన్ రావు పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తులో ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మిగిలిన విషయాలను చెప్పలేనని, నిందితులు ఎంతటివారైనా పట్టుకుని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. అంతర్వేదిలో రూ.95 లక్షలతో నూతనంగా రథాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.

కాగా ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ‘ఛలో అంతర్వేది’కి పిలుపునిచ్చారు. అనుమతులు లేనందున ఈ కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్ధమైన సోము వీర్రాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More:

బడా మాల్స్‌, షోరూంలకు జీహెచ్‌ఎంసీ జరిమానా.. ఎందుకంటే

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,043 కొత్త కేసులు.. 11 మరణాలు

 

Loading...
Unable to load recommendations.
Follow Us