Vegetables: ప్రజలకు గుడ్న్యూస్.. రైతు బజార్ల ద్వారా మీ ఇంటికే కూరగాయలు.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్..
ఏపీ ప్రభుత్వం క్విక్ కామర్స్ వెబ్సైట్ను లాంచ్ చేసింది. దీని ద్వారా జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ యాప్స్ తరహాలో ప్రజలు ఆన్లైన్లో నిత్యావసర సరుకులు ఆర్డర్ చేయొచ్చు. రైతు బజార్ల ద్వారా నిమిషాల్లోనే ప్రభుత్వం సరుకులు డోర్ డెలివరీ చేస్తుంది.

Rythu Bazars: స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ లాంటి క్విక్ కామర్స్ యాప్లు కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులను డెర్ డెలివరీ చేస్తున్నాయి.ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఇంటికి వద్దకే వచ్చేస్తున్నాయి. ఏది కావాలన్నా క్షణాల్లోనే ఇంటికి వస్తుండటంతో ఈ ఫ్లాట్ఫామ్స్కు ప్రజలు కూడా బాగా అలవాటు పడ్డారు. డిమాండ్ ఉన్న కారణంగా ఇలాంటి కొత్త యాప్స్ మార్కెట్లోకి తెగ వచ్చేస్తున్నాయి. అంతేకాదు ఆఫర్ల పేరుతో ప్రజలను కట్టిపడేస్తున్నాయి. అయితే ప్రభుత్వమే ఇలాంటి సేవలను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదే పని చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ క్విక్ కామర్స్ ఫ్లాట్ఫామ్స్కి పోటీగా కొత్త వెబ్సైట్ను లాంచ్ చేసింది.
ఏపీ ప్రభుత్వం https://digirythubazaarap.com/ అనే క్విక్ కామర్స్ వెబ్సైట్ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఆర్డర్ చేసుకున్నవారికి నేరుగా ఇంటి వద్దకే కూరగాయలు, పండ్లు లాంటివి డెలివరీ చేయనుంది. ఇందుకోసం రైతు బజార్లను ఉపయోగించుకోనుంది. ఈ వెబ్సైట్లో దగ్గర్లోని రైతు బజార్లు మీకు కనిపిస్తాయి. వాటిల్లో కూరగాయలు, పండ్ల ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు కూడా ఉంటాయి. మీకు కావాల్సిన వాటిని ఎంచుకుని ఆర్డర్ చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. మీరు ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మీ ఇంటికి డెలివరీ చేస్తారు. రైతు బజార్లలో ఉన్న ధరలకే మీరు ఆన్లైన్లోనే చేయవచ్చు. రైతు బజారుకు 5 కిలోమీటర్ల దూరం వరకు డెలివరీ చేస్తారు.
ఈ విధానం వల్ల రైతులు కూడా లాభం జరగనుంది. రైతులకు అమ్మకాలు ఎక్కువగా జరగడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇక తక్కువ ధరలకు కూరగాయలు రావడం వల్ల ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నంలోని ఎంపీపీ కాలనీ రైతు బజార్లో ఈ సేవలను ప్రారంభించారు. త్వరలో విడతల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. అలాగే సులువుగా సేవలు పొందేందుకు యాప్ కూడా తీసుకురానున్నారు. ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్ తమ లాభం కోసం అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నాయి. ఇక అదనపు ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ వెబ్సైట్లో ధరలు తక్కువగా ఉండటంతో పాటు అదనపు ఛార్జీలు ఏమీ ఉండదు. దీంతో సామాన్యులకు డబ్బులు కూడా ఆదా అవుతాయి.
