Andhra Pradesh: వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఖాకీలు.. ఆ కాల్ కాస్త ఆలస్యమైతే..! విశాఖ పోలీసులపై ప్రశంసలు..

| Edited By: Ravi Kiran

Aug 26, 2023 | 7:11 PM

Visakhapatnam: ఓవైపు వెతుకుతూనే మరోవైపు కుటుంబ సభ్యులకు కాల్ చేశారు పోలీసులు. మరిన్ని వివరాలు సేకరించారు. అవెంజర్ బైక్ పై రవితేజ వెళ్లినట్టు చెప్పడంతో.. టవర్ లోకేషన్ వచ్చిన ఆరు కిలోమీటర్ల రేంజ్ లో ఎక్కడున్నాడో తెలుసుకోవడం పోలీసులకు కష్టమైంది. అయినా సరే పట్టు వదలకుండా బీచ్ ఒడ్డునే గాలించారు. 

Andhra Pradesh: వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఖాకీలు.. ఆ కాల్ కాస్త ఆలస్యమైతే..! విశాఖ పోలీసులపై ప్రశంసలు..
Ap Police
Follow us on

విశాఖపట్నం, ఆగస్టు 26: – విశాఖ సిటీ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. డయల్ 100 కు వచ్చిన ఫోన్ కాల్ పై వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. క్షణాల్లో సమాచారాన్ని భీమిలి పోలీసులకు చేరవేశారు. మెసేజ్ రాగానే హుటాహుటిన బీచ్ రోడ్డుకు వెళ్లారు పోలీసులు. అక్కడ బైక్ చెప్పులు కనిపించాయి.. కానీ మనిషి లేడు. అయ్యో ఏమైపోయాడో.! అనుకున్నారు.. అయినా.. ఏదో ఒక చిన్న ఆశ.. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా వెతికారు. తీరం ఒడ్డున దూరంలో ఎవరో సముద్రంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. పరుగులు పెట్టిన పోలీసులు.. అక్కడికి వెళ్లి చూస్తే ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడు ఒక వ్యక్తి. అప్పటికే ఓసారి ఈ సముద్రంలోకి వెళ్లి కెరటం కొట్టడంతో ఒడ్డుకు వచ్చేసాడు. మరోసారి వెళ్లబోయే ప్రయత్నంలో.. ఎస్సై హరీష్ నేతృత్వంలో పోలీసులు.. అతన్ని పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ చేశారు. కట్ చేస్తే.. రమ్మీ కి అలవాటు పడి.. అప్పులు చేసి..నిండా మునిగి.. బలవన్మరణానికి పాల్పడేందుకు సిద్ధమయ్యాడు ఆ వ్యక్తి. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు చేసిన ఆ ఒక్క ఫోన్ కాల్.. అతని ప్రాణాలను రక్షించింది. పూర్తి  వివరాల్లోకి వెళ్తే…

– పెందుర్తి చిన ముషిడివాడ ప్రాంతంలోని శ్రమ శక్తి నగర్ లో రవితేజ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఓ కూతురు. వ్యాపారం చేసే రవితేజ.. ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడు. అది ఒక ఊబి అని తెలియక.. అందులో దిగాడు. డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి. ఒకసారి డబ్బులు పోయినా వస్తాయని ఆశ. దీంతో.. రమ్మీ ని కంటిన్యూగా ఆడడం ప్రారంభించాడు. 15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. కొంతమంది సన్నిహితుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మరికొన్ని ఆన్లైన్ యాప్స్ లోనూ లోన్ తీసుకున్నాడు. అంతా కలిపి ఆన్లైన్లో పెట్టేసాడు. ఒకవైపు అప్పులు పెరిగిపోతున్నాయి.. డబ్బులు వస్తాయనుకుంటే రమ్మీ లో పోతున్నాయి. అసలు తో పాటు వడ్డీ తలకు మోపెడవుతుంది. రుణం ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి మొదలైంది. కొందరు నుంచి వేధింపులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తవానికి గురైన రవితేజ.. బయటకు వెళ్ళొస్తానని ఈనెల 24న ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం పూట భార్యకు చెప్పి వెళ్ళిపోయాడు. చీకటి పడింది ఇంటికి సరిపోలేదు. వస్తాడులే అనుకున్నారు కుటుంబ సభ్యులు.

ఆ వాట్సాప్ మెసేజ్..!

ఇవి కూడా చదవండి

ఇంతలో రవితేజ తన బందువుకి ఓ మెసేజ్ వాట్సాప్ లో కనిపించింది. అందులో అప్పులు తీసుకున్న వివరాలతో పాటు.. ఇక తాను తిరిగి రాలేనని .. ఆత్మహత్య చేసుకోబోతున్నాం అనేది సారాంశం. రాత్రి 10:30 సమయంలో వచ్చిన ఆ మెసేజ్ తో ఒక్కసారిగా గుండెలు పట్టుకుంది ఆ కుటుంబం.

డయల్ 100 కు వచ్చిన కాల్ తో అలర్ట్..

– రవితేజ కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై.. రాత్రి 10:40 సమయంలో డైలీ 100 కు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సిబ్బంది.. రవితేజ మొబైల్ ఫోన్ టవర్ లోకేషన్ ట్రాక్ చేసి.. భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల్లోనే రష్ అయిన ఎస్సై హరీష్ నేతృత్వంలోని భీమిలి పోలీసులు.. బీచ్ ఒడ్డుకు వెళ్లారు. అంతా చీకటి. ఓవైపు వెతుకుతూనే మరోవైపు కుటుంబ సభ్యులకు కాల్ చేశారు పోలీసులు. మరిన్ని వివరాలు సేకరించారు. అవెంజర్ బైక్ పై రవితేజ వెళ్లినట్టు చెప్పడంతో.. టవర్ లోకేషన్ వచ్చిన ఆరు కిలోమీటర్ల రేంజ్ లో ఎక్కడున్నాడో తెలుసుకోవడం పోలీసులకు కష్టమైంది. అయినా సరే పట్టు వదలకుండా బీచ్ ఒడ్డునే గాలించారు.

 

అక్కడ బైక్.. చెప్పులు.. చీకట్లోనే..!

– అంత చీకటిలోనూ బీచ్ ఒడ్డున విస్తృతంగా గాలించారు భీమిలి పోలీసులు. నిమిషాల వ్యవధిలోనే.. కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారం ఆధారంగా బీచ్ ఒడ్డున మార్లిన్ కే హోటల్ తీర ప్రాంతంలో బైకు గుర్తించారు. ఆ పక్కనే చెప్పులు కనిపించాయి. తీర ప్రాంతం అంతా చీకటిగా ఉన్నప్పటికీ.. పట్టు వదలకుండా విస్తృతంగా గాలించారు. అప్పటికే బైక్ కనిపించడంతో కాస్త పోలీసులకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకాస్త ఆలస్యమైతే చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని అనుకొని.. బీచ్ ఒడ్డున గాలిస్తూ ఉన్నారు. ఈ సమయంలో బైక్ కనిపించిన కాస్త దూరంలో ఎవరో సముద్రం వైపు వెళ్తున్నట్టు కనిపించింది. పరుగులు పెట్టి అక్కడ వెళ్లిన పోలీసులకు.. కెరటాల వైపు వెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి రవి తేజ గానే గుర్తించారు. అప్పటికే పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. అంటే అప్పటికే ఓ ప్రయత్నం చేశాడు. ఈ లోగా పోలీసులు సమయానికి చేరుకోవడంతో.. అతని ఆత్మహత్య ప్రయత్నం విఫలమైందని అంటున్నారు ఎస్సై హరీష్.

కాస్త ఆలస్యమైతే..

– కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన ఆ సమాచారం పై కాస్త ఆలస్యమైనా పరిస్థితి చేయి దాటిపోయేది. మరో నిండు ప్రాణం బలయ్యేది. ఎస్సై హరీష్ తో పాటు, బేస్ మొబైల్ పెట్రోల్ ఏ ఎస్ ఐ సత్యనారాయణ ఈ సెర్చ్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు. రవితేజను భీమిలి సిఐ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ చేశారు. రూ. 15 లక్షల కోసం విలువైన ప్రాణాలకు తీసుకొని కుటుంబానికి దూరం అవడం సరికాదని పోలీసులు నచ్చ జెప్పి అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి రవితేజ ప్రాణాలు కాపాడిన భీమిలి పోలీసులను అధికారులు అభినందించారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..