Kesineni Nani: ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్గా గెలుస్తా.. మరోసారి నాని కీలక వ్యాఖ్యలు
బెజవాడ టీడీపీలో కేశినేని నాని కాక తగ్గలేదు. నందిగామలో మొదలైన ఎపిసోడ్.. ఇప్పుడు మైలవరానికి చేరింది. వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ ఎంపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంపై.. టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని దూకుడు టీడీపీలో అగ్గిరాజేస్తోంది. వైసీపీతో చెట్టపట్టాల్…కలకలం రేపుతున్నాయి. దేశంకోసం ఎవరితోనైనా కలుస్తామంటూ టీడీపీలో తుఫాను రేపుతున్నారు. మొన్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావుతో కలిసి కనిపించిన కేశినేని నాని, తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఏ పిట్టల దొరకు టిక్కెట్ వచ్చినా అభ్యంతరం లేదనీ, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గా గెలుస్తానేమోనంటూ కేశినేని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతేకాదు ఇక్కడ పార్టీలు లేవు.. వేదికలు మాత్రమే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
“నేను కరెక్టా…రాంగ్ అనేది నాకు తెలుసు. నాకు పార్టీ పట్ల విధేయత ఉందో లేదో నాకు తెలుసు. నాకు పార్టీ టిక్కెట్ ఇస్తుందా లేదా…ఎంపీ అవుతానా లేదా అనే బాధ లేదు. నేను చేసిన అభివృద్ధి ఇంకెవరూ చేయలేదు. ఇక్కడ రెండు ఫ్లాట్ ఫామ్లు మాత్రమే ఉన్నాయి. పార్టీలు లేవు. వైసీపీకి జగన్, మాకు చంద్రబాబు నాయకులు. వాళ్ళిద్దరే విరోధులు…ఇంకెవరూ విరోధులు కాదు” అని కేశినేని నాని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా అధిష్ఠానంపై తన అసమ్మతిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు నాని. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు.. నాని సోదరుడు చిన్నిని ఎంకరేజ్ చేస్తుంది పార్టీ. ఇప్పటికే చిన్ని.. జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేసి తన ఉనికిని చాటుకున్నారు. ఈ సారి టీడీపీ విజయవాడ ఎంపీ టికెట్ చిన్నికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు చాలామంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇక ఇటీవల నందిగామ వచ్చిన కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజకీయ వైరం మర్చిపోయి వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు కితాబులిచ్చుకోవడం జనాల్ని ఆశ్చర్యపరిస్తే.. నందిగామ తెలుగు తమ్ముళ్లకు సర్రున కాలింది. లోకల్గా వైసీపీ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అని పోరాటం చేస్తుంటే టీడీపీ ఎంపీ కేశినేని నాని వచ్చి అదే అధికారపార్టీ శాసనసభ్యుడికి గుడ్ కాండెక్ట్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు సమావేశమై నానిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు కూడా. కేశినేని నానికి వ్యతిరేకంగా నందిగామ టీడీపీ ఫేస్బుక్ పేజీలో పోస్టింగ్స్ నిండిపోయాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..