AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ నేతలు, ఏపీ పోలీసుల మధ్య ట్విటర్ వార్.. ఫోటో ట్వీట్ చేసిన చంద్రబాబు.. పచ్చి అబద్దం అంటూ కొట్టిపారేసిన పోలీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు, పోలీసుల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓ ఫోటోను ట్వీట్ చేయగా.. అది పచ్చి..

టీడీపీ నేతలు, ఏపీ పోలీసుల మధ్య ట్విటర్ వార్.. ఫోటో ట్వీట్ చేసిన చంద్రబాబు.. పచ్చి అబద్దం అంటూ కొట్టిపారేసిన పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Dec 19, 2020 | 1:57 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు, పోలీసుల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓ ఫోటోను ట్వీట్ చేయగా.. అది పచ్చి అబద్దం అంటూ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది. అసలు జరిగింది ఇదీ అంటూ మరికొన్ని ఫోటోలను ట్వీట్ చేసింది. ఆ వెంటనే స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసు తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

చంద్రబాబు ట్వీట్ ఇదే..

తొలుత ఓ పోలీస్ అధికారి గాయపడిన దానికి సంబంధించిన ఫోటోను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో వైసీపీ నేతలు సదరు పోలీస్ అధికారి నెత్తిపై చేయి పెట్టినట్లుగా ఉంది. ఆ ఫోటోను ట్వీట్ చేసిన చంద్రబాబు.. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ ఫోటోనే నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై వైసీపీ గూండాలు దాడి చేశారు. రాష్ట్రంలో పోలీస్ అధికారులకు కూడా రక్షణ లేకుండా పోతోంది.’ అంటూ ట్వీట్ చేశారు.

అదంతా అబద్ధం.. ఇదీ నిజం..

అయితే చంద్రబాబు ట్వీట్ కాస్తా వైరల్ అవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పింది అబద్దం అంటూ స్పష్టం చేశారు. అసలు జరిగింది ఇదీ అంటూ ఘటన తాలూకు మరికొన్ని ఫోటోలను అటాచ్ చేస్తూ రీట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ అంటూ ట్వీట్ చేసిన ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్.. ‘మీరు చేసిన పోస్ట్ నిజం కాదు. మీ ఆరోపణలు పూర్తిగా అబద్దం. కిందపడి గాయపడిన పోలీస్ అధికారికి సదరు వైసీపీ నేతలు సాయం చేశారు. మీవంటి నేతలు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం తగదు. ఇది పోలీసు సిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. దయచేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను అదుపులో ఉంచేందుకు పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము’ అంటూ రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్వీట్‌లో చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది.

నారా లోకేష్ సీరియర్ రియాక్షన్..

ఇదిలాఉండగా, రాష్ట్ర పోలీస్ శాఖ ట్వీట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరుపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘తన్నులు తిని వైకాపా వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని జగన్ రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారు. వైకాపా గూండాల నుండి సాటి పోలీసుల్ని కాపాడుకోలేని వాళ్ళు వాస్తవాలు తెలిసినా కళ్ళకి గంతలు కట్టుకొని ఫ్యాక్ట్ చెక్ అంటూ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పోలీసు గాయపడ్డారు అని మీరే అంటున్నారు. మరి ఎవరి దాడిలో పోలీస్ గాయపడ్డారు? ఆయనకి ఆయనే గాయపర్చుకున్నాడా? ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టలేదు? బాడీ వార్న్ కెమెరాల వీడియోలు ఎందుకు మాయం అయ్యాయి? గాయపడిన పోలీసుకి అయింట్మెంట్ రాయాల్సింది పోయి జగన్ రెడ్డికి అయింట్మెంట్ పూయడం బాధాకరం. వైకాపా గూండాల దాడిలోనే పోలీస్ గాయపడ్డారు. వైకాపా నాయకులు పోలీసులపై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు అందుకే నేను విడుదల చేస్తున్నా’ అంటూ నారా లోకేష్ మరో వీడియోను విడుదల చేశారు. ఇలా ప్రతిపక్ష నేతలు, రాష్ట్ర పోలీసు డిపార్ట్‌మెంట్ మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు పోతుందో వేచి చూడాల్సిందే.

Follow Us