ఈ ఆవు పొట్ట అసహజంగా ఉబ్బిపోయింది.. పశువైద్యులు పరీక్షించగా కడుపులో..

పుల్లయ్య అనే రైతు పెంచుతున్న ఆవు… కొన్ని రోజులుగా పొట్ట అసహజంగా ఉబ్బిపోవడం, ఆహారం తినకపోవడం, తీవ్రంగా బాధపడడం ప్రారంభించింది. మొదట ఇది సాధారణ జీర్ణ సమస్య అనుకున్నారు. కానీ పరిస్థితి క్రమంగా విషమించింది. పశువైద్యులు పరీక్షించగా అసలు సమస్య బయటపడింది.

ఈ ఆవు పొట్ట అసహజంగా ఉబ్బిపోయింది.. పశువైద్యులు పరీక్షించగా కడుపులో..
Cow Death Plastic Ingestion

Edited By:

Updated on: Apr 11, 2026 | 10:44 AM

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మింగిన ఆవు కడుపులో నుంచి సుమారు 100 కిలోల ప్లాస్టిక్‌ను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ, ఆ ఆవు ప్రాణాలు కోల్పోయింది. పట్టణానికి చెందిన పుల్లయ్య అనే రైతు పెంచుతున్న ఆవు కొన్ని రోజులుగా పొట్ట ఉబ్బిపోవడం, ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో పశువైద్యులను సంప్రదించగా, అత్యవసరంగా రూమెనాటమీ శస్త్రచికిత్స చేపట్టారు. శస్త్రచికిత్సలో ఆవు కడుపులో నుంచి భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను తొలగించారు. దాదాపు 100 కిలోల వరకు ప్లాస్టిక్ ఉండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఆ ఆవు గర్భంతో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కడుపు ఉబ్బరం కారణంగా గర్భాశయం ప్రోలాప్స్ సమస్య తలెత్తడంతో, డాక్టర్లు శ్రమించి.. ప్లాస్టిక్ మొత్తం తొలగించి.. గర్భాశయాన్ని తిరిగి యధాస్థానంలో ఉంచారు.

శస్త్రచికిత్స అనంతరం ఆ ఆవు దూడకు జన్మనిచ్చింది. ఒకవైపు కొత్త జీవితం..మరోవైపు ఆ తల్లి ప్రాణం కోసం పోరాటం.  కానీ ఆ పోరాటం ఎక్కువసేపు నిలవలేదు. ఆపరేషన్ తర్వాత కోలుకోలేక.. అర్ధరాత్రి ఆ ఆవు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పుల్లయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.

ఈ సందర్భంగా అధికారులు పశుపోషకులకు సూచనలు జారీ చేశారు. పశువులను రోడ్లపై విడిచిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆహార వ్యర్థాలతో కూడిన ప్లాస్టిక్ కవర్లను బయట పారవేయొద్దని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మింగడం వల్ల పశువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇది కేవలం ఒక ఘటన కాదు.. మన నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ. ప్లాస్టిక్ మన జీవితంలో ఎంత ప్రమాదమో.. మాటల్లో కాదు… ఇలాంటి ఘటనలే చెబుతున్నాయి.

Also Read: ఇంత ఓపెన్ మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది.. వైరల్ ట్రైన్ సీన్‌పై బాలయ్య కామెంట్.. 

Follow Us