కేసు పెట్టడానికి స్టేషన్కొస్తే మహిళా అని చూడకుండా బెల్టు తీసి కొట్టాడు.. అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించాడు..
కంప్లెంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ యువతిని బెల్టుతో కొట్టాడు ఓ బుద్ధిలేని ఎస్సై. దీంతో ఆ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై వేటుపడింది.
కంప్లెంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ యువతిని బెల్టుతో కొట్టాడు ఓ బుద్ధిలేని ఎస్సై. దీంతో ఆ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై వేటుపడింది. తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన వనిత ఆటో నడుపుతూ బతుకుతుంది. తన ఇంటిలోకి తుమ్మలగుంట కాలనీకి చెందిన కొందరి గేదెలు వచ్చి గార్డెన్ను నాశనం చేస్తున్నాయి. గమనించిన వనిత పశువులను వెళ్లనివ్వకుండా గేటు వేసి వాటి యజమానులతో గొడవకు దిగింది. ఇది మళ్లీ పునరావృతం కాకుండా ఉండటానికి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లెంట్ ఇవ్వడానికి వెళ్లింది. అయితే ఆమె వెళ్లేసరికి స్టేషన్ గదులు మొత్తం అప్పుడే కడిగి పూజ చేయడానికి సిబ్బంది సిద్దంగా ఉంచారు. బాధితురాలు చూసుకోకుండా లోపలికి వెళ్లడంతో అక్కడున్న ఎస్సై ప్రకాశ్ రాజ్ ఆగ్రహంతో ఆమెను తిట్టాడు. దీంతో వనిత ఎందుకు తిడుతున్నావని అడిగినందుకు కోపోద్రిక్తుడై బెల్టు తీసి మరీ కొట్టాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిన యువతి నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఎస్పీ లేకపోవడంతో ఎంఆర్పల్లి స్టేషన్కు చేరుకొని ధర్నాకు దిగింది. అక్కడ కూడా ఓ మహిళా పోలీసు ఆమెను బండ బూతులు తిట్టిందని వాపోయింది. దీంతో స్పందించిన అదనపు ఎస్పీ సుప్రజ నివేదికను ఎస్పీ రమేశ్రెడ్డికి అందించడంతో ఆయన విచారణ జరిపి ఎస్సై ప్రకాశ్ రాజ్పై చర్యలు తీసుకున్నారు.