Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. జూన్‌ నాటికి తిరుపతి ఐఐటి సిద్ధం.. ‘సాక్షమ్’గా అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్..

|

Apr 05, 2023 | 5:47 PM

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న ఐఐటీ క్యాంపస్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి అప్పగిస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ..

Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. జూన్‌ నాటికి తిరుపతి ఐఐటి సిద్ధం.. ‘సాక్షమ్’గా అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్..
Tirupati Iit
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని ఐఐటీ క్యాంపస్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి అప్పగిస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణ పనులు ఈనెలా ఖరులోగా పూర్తి కావలసి ఉందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని ఐఐటీలు అన్నింటికి కలిపి 9361 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు 407 కోట్ల రూపాయలు కేటాయించవలసిందిగా తిరుపతి ఐఐటి యాజమాన్యం కోరిందన్నారు. అయితే తిరుపతి ఐఐటీకి ఎంత మొత్తం కేటాయించాలన్న అంశం ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఐఐటిలకు కేటాయించిన 9361 కోట్ల రూపాయల నుంచే సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి వేతనాలు, చిన్న చిన్న పరికరాలు, లైబ్రరీ పుస్తకాలు, వడ్డీ చెల్లింపులు వంటి వాటి చెల్లింపుల కోసం ఉద్దేశించినవని మంత్రి చెప్పారు.

2 లక్షల అంగన్వాడీలను సాక్షమ్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌

అంగన్వాడీ కేంద్రాల్లో 6 ఏళ్లలోపు పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో ఏడాదికి 40 వేల చొప్పున దేశవ్యాప్తంగా 5 ఏళ్ళలో 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను సాక్షమ్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ ఏడాది ఆశావహ జిల్లాల పరిధిలోని 40 వేల అంగన్వాడీ కేంద్రాలను ‘సాక్షమ్ అంగన్వాడీలు’గా అప్‌గ్రేడ్‌ చేయబోతున్నట్లు ఆమె చెప్పారు. సాక్షమ్ అంగన్వాడీల్లో ఇంటర్నెట్, వైఫై, ఎల్ఈడీ స్క్రీన్లు, స్మార్ట్ లెర్నింగ్, ఆడియో విజువల్ పరికరాలు, చైల్డ్-ఫ్రెండ్లీ లెర్నింగ్ పరికరాలను సమకూర్చనున్నట్లు కూడా తెలిపారు.

ఇవి కూడా చదవండి

అలాగే న్యూట్రిషన్, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లకు సమాన ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అపప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈమేరకు తమ ప్రతిపాదనలు పంపంవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు, ఎన్ని మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్న మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 6837 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 48,770 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలతో కలిపి మొత్తం 55,607 కేంద్రాలు ఉన్నట్లు మంత్రి జవాబిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.