
TTD Tirupati Darshan Tickets
తిరుపతి, మార్చి 13: శ్రీవారి దర్శనానికి జూన్ నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవకోటా టికెట్ల విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను తితిదే బుధవారం (మార్చి 13) ప్రకటించింది. జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవకోటా వివరాలు ఇవే..
- మార్చి 18వ తేదీ ఉదయం 10 నుంచి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
- మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
- జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21 ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచుతారు.
- మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు.
- మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఇక అదే రోజు 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
- మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటాను విడుదల చేస్తారు.
- మార్చి 27వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటా టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా టికెట్లు, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.