Tirumala: తిరుమల నీటి అవసరాలను తీర్చిన మిచౌంగ్ తుఫాన్.. నీటి కటకట అన్న మాటకు ఆస్కారమే లేదిక

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు. తిరుమలలో జలాశయాలున్నా ఒకొక్కసారి వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. అయితే ఈ ఏడాది తిరుమల నీటి అవసరాలను మిచౌంగ్ తుఫాన్ తీర్చింది. ఏడుకొండల్లోని ఐదు జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఇక ఏడాది దాక తిరుమలలో నీటి  అవసరాలకు ఎలాంటి ఢోకా ఉండదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. 

Tirumala: తిరుమల నీటి అవసరాలను తీర్చిన మిచౌంగ్ తుఫాన్.. నీటి కటకట అన్న మాటకు ఆస్కారమే లేదిక
Tirumala Projects

Edited By: Surya Kala

Updated on: Dec 10, 2023 | 8:09 AM

మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీ తో సహా అనేక ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలు కురవడంతో తిరుమలలో కొండ కోనల్లో వాగులు ఉప్పొంగాయి. దివి నుంచి భువి దిగి వచ్చినట్టు గంగమ్మ పరవళ్లు తొక్కింది. జాలువారే జలధారలతో తిరుమలలో జలదృశ్యం అబ్బురమన్పించింది. అల్లంత ఎత్తు నుంచి దూకిన జలధారలను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఎడదెరిపిలేని వానలతో  తిరుమలలోని ఐదు జలశయాలు నిండు కుండల్లా మారాయి. పాపవినాశనం డ్యామ్ , గోగర్భం ఆకాశగంగ, కుమారధార, పసుపుధార రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం తిరుమల జలాశయాల్లో భారీగా నీరు చేరడంతో నిండుకుండను తలపిస్తున్నాయి. ఐదుకు ఐదు రిజర్వాయర్లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో వుంది. మరో ఏడాది వరకు తిరుమలకు ఇక నీటి ఎద్దడి అనే ప్రసక్తే ఉండదన్నారు టీటీడీ వాటర్‌ వర్క్స్‌ అధికారులు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ,అధికారులతో కలిసి తిరుమల జలశయాలను సందర్శించారు. ఇదంత ఏడుకొండల వాడి కరుణా కటాక్షమన్నారాయన.

రోజు రోజుకు కొండంత రద్దీ పెరుగుతోంది సరే రానున్న రోజుల్లో తిరుమల అవసరాలకు సరిపడ నీరు ఎలా? అనే అంశంపై ఇటీవలే టీటీడీ బోర్డులో చర్చ జరిగింది. నీటి ఎద్దడిని అధిగమించేలా కండలేరు రిజర్వాయర్‌ నుంచి తిరుమలకు నీటిని పంపింగ్‌ చేయాలని సమావేశంలో చర్చించారు. కానీ కాగల కార్యం కలియుగ దైవం అనుగ్రహంతో తీరిందన్నారు భూమాన. న‌వంబ‌రు 23న ప్రారంభించిన  శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం ఫలితమే ఈ జలకళ అన్నారాయాన.

ఇవి కూడా చదవండి

ఔను.. ఈ నెల 3న కుండపోతగా కురిసిన వానలతో తిరుమల జలాశయాలు ఇలా నిండుకుండల్లా మారాయి.  అధికారులు ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నారు. వరద పెరగడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. కండలేరు నుంచి ఎత్తి పోతలు అక్కర్లేదు. ఇప్పుడు నీటి నిల్వలతో ఇక ఏడాది వరకు బేఫికర్‌. తిరుమలలో నీటి కటకట అనే మాటకు ఆస్కారమే లేదిక అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..