
తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు అనుబంధ ఆలయాల్లో ఆ దేవదేవుడికి కానుకలగా వచ్చిన, ఆయన ఉపయోగించిన వస్త్రాలు వేలం వేయనున్నారు. ఈ మేరకు వివరాలను టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి/ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి (287) లాట్ల ఆర్ట్ సిల్క్ చీరల, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు, ఆర్డినరీ చీరలు తేదీ 02.03.2026 నుంచి 09.03.2026 తేదీ వరకు టీటీడీ వారు ఆన్లైన్లో EA ID Nos 25597 నుంచి 25602, 25604 నుంచి 25609 ద్వారా ఈ – వేలం వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) ఏఈవో ( వేలములు), టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం దివ్యమంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు పుష్పాలతో, పతాకాలతో అలంకరించిన మహారథాన్ని అధిరోహించి భక్తకోటికి కృపాకటాక్ష దర్శనం ప్రసాదించారు.
“గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగిన ఆలయ పరిసరాల్లో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
శ్రీవారి రథదర్శనం జన్మజన్మాంతర పాపాలను హరించి భక్తులకు మోక్షసౌభాగ్యం ప్రసాదిస్తుందని, రథస్థుడైన మాధవుడి దర్శనం పునర్జన్మ బంధనాలను నివారిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఈ దివ్య ఉత్సవ శ్రేణిలో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు పుణ్యదర్శనం అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎల్.ఏ.సీ. ప్రెసిడెంట్ ఏ.వి. రెడ్డి, ఆలయ ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్ నిరంజన్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.