
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిదానం తిరుమలలో అన్య మత చిహ్నం స్టిక్కర్తో వాహనం తిరగడం తీవ్ర కలకలం రేపింది. కొండపై అన్యమత స్టిక్కర్లలో ఉన్న వాహనాన్ని గుర్తించిన టీటీడీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. వాహనంతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. వాహనం తమిళనాడు రాష్ట్రానికి చెందిన( TN-31-AE-4073)గా గుర్తించారు. డ్రైవర్తో పాటు వాహన యజమానిపై కేసు నమోదు చేశారు.
టీటీడీ అధికారుల ప్రకారం.. గురువారం ఉదయం 10.40 గంటల సమయంలో అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఈ వాహనం 9 వ లేన్ గుండా వచ్చినప్పటికీ, అక్కడ విధుల్లో ఉన్న CT-5949 వి. వాసు బాబు (9వ లేన్, అలిపిరి) ఈ అన్య మత చిహ్నాన్ని గుర్తించలేకపోయారని సిబ్బందిపై టీటీడీ మండిపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఈ సమాచారం అందిన వెంటనే, సంబంధిత విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని తిరుమల నందు ఫైర్ ఆఫీస్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో గుర్తించి, వెంటనే ఆ స్టిక్కర్ను తొలగించారు. అనంతరం, ఈ విషయంపై తిరుమల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన వాహన డ్రైవర్ గోబి, ఆ వాహనం యజమాని పై AP చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ , ఎండోమెంట్ Act – 1987 ( AP CHRIE ACT) పరిధిలో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. అన్యమత స్టిక్కర్లతో వాహనం తిరుమలలోకి వచ్చినా.. గుర్తించడంలో విఫలమైనందున, CT-5949 వి. వాసు బాబును వెంటనే అలిపిరి విధుల్లో నుండి తొలగిస్తున్నట్టు. అతని పై విధుల్లో నిర్లక్ష్యానికి సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు టీటీడీ పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.