AP News: ఆపరేషన్ మదర్ టైగర్‌లో కీలక పరిణామం.. మరోవైపు కూనలకు ఆహారంగా లివర్

తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాదాపు 300 మంది అటవీశాఖ సిబ్బంది తల్లిపులి ఆచూకీ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం పులి కూనల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది.

AP News: ఆపరేషన్ మదర్ టైగర్‌లో కీలక పరిణామం.. మరోవైపు కూనలకు ఆహారంగా లివర్
Tiger Cubs

Updated on: Mar 08, 2023 | 3:41 PM

నంద్యాల ఆపరేషన్ మదర్ టైగర్ T108E లో కీలక ఆధారం లభ్యమైంది. పెద్ద గుమ్మడాపురం వద్ద పులి పిల్లలు దొరికిన సమీపానికి రెండు కిలోమీటర్ల దూరంలో .. పులి అడుగులను సిబ్బంది గుర్తించారు. అవి మదర్ టైగర్ అడుగులేనా..? అని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు అటవీ శాఖ బృందం ప్రయత్నిస్తోంది. ఒకవేళ అవి తల్లి పులి అడుగులైతే పిల్లలను తల్లి దగ్గరకు చేర్చే మార్గం సులువు అవుతుంది అని అటవీ అధికారులు చెబుతున్నారు. 300 మంది సిబ్బంది, 50 మందికి పైగా అటవీ అధికారులతో ఆపరేషన్ మదర్ టైగర్ కొనసాగుతోంది. శాస్త్రీయంగాను, సాంకేతికంగా తల్లి పులి కోసం గాలిస్తున్నారు. 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరాలతో ట్రేస్ చేస్తున్నారు, అవసరాన్ని బట్టి డ్రోన్ వినియోగిస్తున్నారు. నిపుణుల సూచనల మేరకు పులి కూనలకు పాలు, సెరిలాక్‌తో పాటు నేడు లివర్ ముక్కలను అందించినట్లు మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ తెలిపారు. తల్లిపులికి పిల్లలను దగ్గరికి చేర్చుందుకు ఈ తరహా ప్రయత్నాలు  దేశ చరిత్రలోనే తొలిసారి అని ఆయన చెప్పారు.

అడవిలో పెద్ద పులి… అడవి బయట పులి కూనలు. తల్లి పులి… పులి కూనలు విడిపోయి మూడ్రోజులు దాటిపోయింది. పిల్లలు కనిపించక ఆ తల్లి పులి ఎంతగా అల్లాడిపోతుందో తెలియదుగాని… తల్లి కనిపించక పులి కూనలు మాత్రం అల్లాడిపోతున్నాయ్‌. తల్లిపై బెంగ పెట్టుకుని ముద్ద కూడా ముట్టడం లేదు అవి. ఐస్‌క్రీమ్‌, సెరెలాక్‌, పాలు… ఇలా వాటికి ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పుడిప్పుడే కొద్దిగా తిండి తింటున్నాయి. మరి, ఆ తల్లీ పిల్లలు మళ్లీ కలుస్తాయా? . తల్లి పులిని… పులి కూనల్ని కలిపేందుకు ఫారెస్ట్‌ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

తల్లి లాలన, ప్రేమకు దూరమై విలవిల్లాడుతున్నాయ్‌ పులి కూనలు. మనుషుల మధ్య బిక్కుబిక్కుమంటూ దిగాలుగా కూర్చున్నాయ్‌. మా అమ్మ ఎప్పుడొస్తుందోనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయ్‌ ఆ పులి కూనలు. అయితే, ఆ తల్లీ పిల్లల్ని కలిపేందుకు రెండ్రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పులి కూనలను అడవిలోకి వదిలినా అవి ముందుకు కదలకపోవడంతో తల్లి జాడ కోసం మళ్లీ అన్వేషణ మొదలుపెట్టారు ఫారెస్ట్‌ అధికారులు. పెద్ద పులి… పుల కూనల్ని కలిపేందుకు చేస్తోన్న ఆపరేషన్‌ లీలావతిలో భాగమైంది టీవీ9. దట్టమైన నంద్యాల అడవుల్లో ఫారెస్ట్‌ టీమ్‌తో కలిసి పులి జాడ కోసం అన్వేషిస్తోంది. ఎంతో డేంజర్‌ ఆపరేషన్‌లో పాల్గొంటూ సాహసం చేస్తున్నారు టీవీ9 ప్రతినిధులు.

పెద్ద పులి కోసం మూడోరోజు ఆపరేషన్‌ మొదలుపెట్టారు ఫారెస్ట్‌ అధికారులు. డ్రోన్‌ కెమెరాలు, 50 ట్రాప్‌ కెమెరాలతో అడవిని జల్లెడ పడుతున్నారు. తల్లి పులి… పులి కూనల్ని కలపడం చాలా టఫ్‌ టాస్క్‌ అంటున్నారు డీఎఫ్‌వో. ఇది హైలీ రిస్క్‌ ఆపరేషన్‌ అని చెబుతున్నారు. తల్లీ పిల్లల్ని కలపగలిగితే అది అతిపెద్ద విజయం అంటున్నారు ఫారెస్ట్‌ అధికారి. అంతేకాదు, తల్లి దగ్గరకు చేర్చితేనే ఆ పిల్లలు క్షేమంగా ఉంటాయని చెబుతున్నారు. పిల్లలకు దూరమైన పెద్ద పులి ప్రస్తుతం ఫుల్‌ అగ్రెసివ్‌గా ఉంటుందంటున్నారు ఫారెస్ట్‌ అధికారులు. పిల్లలను వెతుక్కుంటూ గ్రామంలోకి ఎంటరైతే మాత్రం ఎలా డీల్‌ చేయాలో కూడా ప్లాన్‌-B ఆలోచన చేస్తున్నారుమనుషులు తాకిన పులి కూనలను తల్లి దగ్గరకు తీసుకుంటుందా?. ఒకవేళ తిరస్కరిస్తే ఆ పులి కూనల పరిస్థితేంటి? అన్నది ఇక్కడ మరో ప్రశ్న.

మరిన్ని ఏపీ వార్తల కోసం..