AP Panchayat Elections 2021: మూడోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల అధికారులు అక్రమాలకు పాల్పడుతూ విజేతలను ప్రకటించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లోని ఎనిమిది మండలాల పరిధిలో ఎన్నికల ఫలితాలను తక్షణమే ప్రకటించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో 3వ దశ లెక్కింపులో ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ అధికారులు ఫలితాలను ప్రకటించడం లేదని.. వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు ఫలితాలను నిలిపివేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా పీప్పలి మండలంలోని బావిపల్లి, చంద్రపల్లిలో, చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేశ గౌనూరులో, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని మడిగుబ్బ, గుంతకల్లు మండలంలోని నేలగొండలో, గుంటూరు జిల్లా మంచవరం గ్రామ పంచాయతీలల్లో ఫలితాలను అధికారులు నిలిపివేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది ఈ గ్రామాలకే పరిమితం కాదని చాలాచోట్ల ఇలాగే ఉందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ, రెండవ దశ ఓట్ల లెక్కింపులో ఇలానే జరిగిందంటూ పేర్కొన్నారు. నిలిపివేసిన ఫలితాలను వెంటనే ప్రకటించాలని.. అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డకు లేఖ రాశారు.
Also Read: