
‘చెడపకురా చెడేదవు’.. పెద్దలు ఊరికే అనలేదు. ఒకరు కష్టపడి కొనుక్కున్న బైక్ను దొంగిలించిన ఆ దొంగ.. 24 గంటలు కూడా తిరక్కుండానే అదే బైక్పై మృత్యువాత పడ్డాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ విచిత్రమైన, ఘోర రోడ్డు ప్రమాద ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే బైక్ చుట్టూ దొంగతనం కేసు, ఘోర రోడ్డు ప్రమాదం తిరగడంతో పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి ఆదివారం (జూన్ 07) రాత్రి వ్యక్తిగత పనిమీద నంద్యాల రైల్వే స్టేషన్కు వచ్చాడు. తన ద్విచక్ర వాహనాన్ని అక్కడి పార్కింగ్లో ఉంచి వెళ్లాడు. అయితే సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ బైక్ కనిపించలేదు. ఎవరో దొంగిలించారని గ్రహించిన వెంకటరమణ.. వెంటనే నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, బైక్ పోయిన కొన్ని గంటల్లోనే సీన్ పూర్తిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం పాణ్యం సమీపంలోని జాతీయ రహదారిపై ఒక ఘోర ప్రమాదం జరిగింది. కర్నూలు వైపు నుంచి నంద్యాల వైపు వేగంగా వస్తున్న ఒక బొలెరో వాహనాన్ని, ఎదురుగా వస్తున్న సదరు ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. ద్విచక్ర వాహనం పూర్తిగా తుక్కుతుక్కైపోయింది. దానిపై ప్రయాణిస్తున్న 40 నుంచి 45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాద స్థలానికి చేరుకున్న పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి గురైన బైక్ నెంబర్ను పరిశీలించారు. దాంతో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఆ బైక్ అంతకుముందు రోజే నంద్యాల రైల్వే స్టేషన్లో చోరీకి గురైన వెంకటరమణ బైక్గా రికార్డుల్లో తేలింది.
దీంతో ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి.. ఆ బైక్ను దొంగిలించిన దొంగే అయి ఉండొచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతి చెందిన వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ కేసును పూర్తిగా ఛేదిస్తామని పాణ్యం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బైక్ దొంగతనం జరిగిన 24 గంటల్లోనే దొంగ అదే బైక్పై యాక్సిడెంట్లో చనిపోవడం చూసి.. “పాపం పండిందంటే ఇదేనేమో” అని స్థానికులు అంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..