రేపు సింహాద్రి అప్పన్న నిజరూపదర్శనం…!
వరాహ, నరసింహ అవతారాలు కలిసుండే విగ్రహం ఉన్న ఏకైక హిందూ దేవాలయం సింహాచలంలో ఉంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా పూజలందుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామిని భక్తులు కొలుస్తుంటారు. అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరుగనుంది. ఉత్సవంలో భాగంగా […]
వరాహ, నరసింహ అవతారాలు కలిసుండే విగ్రహం ఉన్న ఏకైక హిందూ దేవాలయం సింహాచలంలో ఉంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా పూజలందుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామిని భక్తులు కొలుస్తుంటారు. అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరుగనుంది.
ఉత్సవంలో భాగంగా సింహాచలేశుని మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో మేల్కొలిపి గంగధార నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శిరస్సు, వక్షస్థలంపైన రెండు పచ్చి చందనపు ముద్దలను ఉంచుతారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు తొలి దర్శనం కల్పిస్తారు. ఆ తరువాత వీవీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సామాన్య భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, మెడికల్, జీవీఎంసీలతోపాటు అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేశారు. . వీవీఐపీలకు రూ. 1200, వీఐపీలకు రూ.1000 టికెట్లతోపాటు రూ. 500, రూ. 200 టికెట్లను బ్యాంకుల ద్వారా విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఉచిత దర్శనం క్యూలైన్తో కలిపి నాలుగు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్చంద్ర లడ్డా బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. మొత్తం 2000 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్టు విశాఖ నార్త్ ఏసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు.