Andhra Pradesh: శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ అరుదైన ఘనత.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక

| Edited By: Srilakshmi C

Aug 29, 2024 | 3:49 PM

తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఓ సామాన్య టీచర్ కు జాతీయ అవార్డు లభించింది. ఎందరో విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచిన శ్రీకాళహస్తి రూరల్ మండలం ఊరందూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న సురేశే ఆ ఉపాధ్యాయుడు. అందరి ఉపాధ్యాయులులాగా కాకుండా తాను ప్రత్యేకంగా ఉండాలన్న తపన జాతీయ స్థాయి..

Andhra Pradesh: శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ అరుదైన ఘనత.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక
Social Studies Teacher Kunati Suresh
Follow us on

తిరుపతి, ఆగస్టు 29: తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఓ సామాన్య టీచర్ కు జాతీయ అవార్డు లభించింది. ఎందరో విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచిన శ్రీకాళహస్తి రూరల్ మండలం ఊరందూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న సురేశే ఆ ఉపాధ్యాయుడు. అందరి ఉపాధ్యాయులులాగా కాకుండా తాను ప్రత్యేకంగా ఉండాలన్న తపన జాతీయ స్థాయి గుర్తింపుకు కారణం అయ్యింది. విభిన్నంగా పాఠాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అన్నట్లు సురేష్ విద్యా విధానంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. ఎన్నో కేంద్ర, రాష్ట్ర స్థాయి అవార్డులు ఆయనకు దక్కాయి. సాంఘిక శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వారికి సులభంగా అర్థమయ్యేలా వివిధ ప్రాంతాలు, దేశ విదేశాల చిత్ర పటాలు, దేశ సరిహద్దులకు చెందిన వెయ్యికి పైగా మ్యాప్‌లను విక్టోరియా స్టడీస్ పేరిట ముద్రించి ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేశారు టీచర్ సురేష్.

కునాటీ సురేష్.. సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్న సురేష్ కాలానుగుణంగా మారుతున్న విద్య వ్యవస్థలో ఇప్పుడు వస్తున్న సాంకేతిక విద్యకు అనుగుణంగా డిజిటల్ కంటెంట్‌లను క్రియేట్ చేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను వివరించేందుకు డిజిటల్ మొబైల్ యాప్‌లను రూపొందించాడు. వాటిని విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చాడు. సొంత గ్రామం అక్కుర్తిలో ఉంటూ పేదరికంతో చదువుకునేందుకు వీలులేని పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం, పాఠశాలలకు పంపే విధంగా చర్యలు చేపట్టడంలో కునాటి సురేష్ సక్సెస్ అయ్యాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా మారాడు. సులభంగా చదువుకుని అర్థం చేసుకునేలా విజయోస్తు, విజయసాధన సంకల్పం, మహా సంకల్పం, విజయ స్ఫూర్తి లాంటి పేర్లతో స్వయంగా మెటీరియల్ తయారు చేయించి విద్యార్థులకు అందించాడు.

సాంఘిక శాస్త్ర ఫలితాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులై, అగ్రగామిగా వుండేందుకు ఎంతో కృషి చేస్తున్న టీచర్ సురేష్ విద్యా పరమైన శిక్షణ తరగతుల్లో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్శన్ గా కూడా వ్యవహరించారు. ఎన్నో డిజిటల్ మ్యాప్ లను తయారు చేసి ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా అందచేశారు. ఇలా తాను నమ్మిన టీచర్ వృత్తిలో రాణిస్తున్న కూనాటి సురేష్ సేవలను గుర్తించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపిక చేశాయి. సెప్టెంబర్ 5న డిల్లీలో జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకొనున్నారు కునాటి సురేష్. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ అవార్డుకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఎంపిక కాగా అందులో కూనాటి సురేష్ ఒకరు.

ఇవి కూడా చదవండి

గతంలో ఎన్నో అవార్డులు అందుకున్న సురేష్ కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ ఉత్తమ ఐసిటి ఉపాధ్యాయ అవార్డు, ఆంధ్ర రత్న అవార్డు, గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు, బీఆర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కార అవార్డు, గురుమిత్ర అవార్డు, జిల్లా స్థాయిలో రెండు సార్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, ప్రావిణ్య ఫౌండేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు అవార్డులు అందుకోవడం విశేషం. ఇక ఎన్నో కేంద్ర, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న సురేష్.. ఏనాడూ తాను అవార్డుల కోసం పనిచేయలేదని, విద్యా భోధనా విధానంలో నూతన మార్పులు చేపట్టి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యంగా పని చేశానని అంటున్నారు. తన సేవలను గుర్తించి జాతీయ ఉత్తమ అవార్డును ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు టీచర్ కునాటీ సురేష్ ముదిరాజ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.