
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పాముకాటు ఘటన భక్తుల్లో కలకలం రేపింది. దుర్గమ్మ దర్శనం కోసం వెళ్తున్న ఓ భక్తుడిని పాము కాటేయడంతో భయాందోళన నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కొండపై నుంచి పాములు కిందకు వచ్చి క్యూలైన్ల చుట్టుపక్కల సంచరిస్తున్నాయి. రేపల్లెకు చెందిన శ్రీనివాసరావు అనే భక్తుడు ఘాట్ రోడ్ ఓం టర్నింగ్ వద్ద అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పాము కాటేసింది.
ఈ ఘటనతో క్యూలైన్లో ఉన్న భక్తులు ఒక్కసారిగా కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే స్పందించిన దేవస్థాన అధికారులు, పోలీసులు భక్తుడిని హుటాహుటిన దేవస్థానం అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు తక్షణ చికిత్స అందించారు. కాటేసినది విషరహిత పాము కావడంతో శ్రీనివాసరావుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Also Read: చేప అనుకుని చేతుల్తో పట్టి ఒడ్డున వేశారు.. తీరా చూస్తే.. ఓర్నాయనో..
ఇక వర్షాల సీజన్లో కొండపైకి వచ్చే పాములు భక్తుల భద్రతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నందున, దేవస్థానం అధికారులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూలైన్ల వద్ద సిబ్బందిని పెంచి, రాత్రి వేళల్లో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని యోచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.