
కడప జిల్లా పులివెందుల పరిధిలోని ముదునూరు రింగ్ రోడ్డు వద్ద సోమవారం (జూలై 06) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రన్నింగ్లో ఉండగానే వెనుక వైపు ఉన్న రెండు టైర్లు ఒక్కొక్కటిగా ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే స్థానికుల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముదునూరు రింగ్ రోడ్డు టర్నింగ్ వద్ద బస్సు స్పీడ్ బ్రేకర్ దాటుతున్న సమయంలో మొదట ఒక టైరు ఊడిపోయింది. ఆ వెంటనే కొద్ది క్షణాల్లోనే రెండో టైరు కూడా ఊడిపోవడంతో బస్సు ఒక వైపుకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. విద్యార్థుల హాహాకారాలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారిపోయింది.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు వెంటనే స్పందించి డ్రైవర్ను అప్రమత్తం చేశారు. వారి సూచనలతో డ్రైవర్ తక్షణమే బ్రేక్ వేసి బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడే అవకాశం ఉండేదని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో స్కూల్ బస్సుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. స్కూల్ ప్రారంభ సమయంలోనే రోడ్డు రవాణా శాఖ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని వారాల్లోనే ఇలా యాంత్రిక లోపాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. బస్సులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని, స్కూల్ బస్సుల భద్రత ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అప్రమత్తత వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..