
ముచ్చటగా మూడ్రోజుల పండుగ. మామూలురోజుల సంగతేమోగానీ ఈ పండక్కి ప్లేట్లో ముక్క పడాల్సిందే. డిమాండ్ పెరగటంతో సంక్రాంతికి నాలుగైదురోజులముందే చికెన్, మటన్ రేట్లు అమాంతం కొండెక్కాయి. గోదావరి జిల్లాల్లో కాస్త తక్కువ రేటుకే దొరికే చేపలకు కూడా డిమాండ్ పెరిగింది. టూస్టేట్స్లో నాన్వెజ్ రేట్లు అదరగొట్టేస్తున్నాయి.
ఆంధ్రా తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో చికెన్ ధర కొండెక్కింది. మటన్ ధర మంటపుట్టిస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే కిలోకి 70నుంచి 100 రూపాయలదాకా పెరిగింది చికెన్ ధర. కేజీ స్కిన్లెన్ చికెన్ 305 నుంచి 320దాకా ఉంది. హైదరాబాద్ లో ఏకంగా 360 రూపాయల వరకు పెరిగింది.. దాదాపు అన్ని ప్రాంతాల్లో 300 ల నుంచి 350 వరకు చికెన్ ధరలు ఉన్నాయి..
ఇక మటన్ అయితే దమ్ముంటే ముట్టుకోమంటోంది. కిలో మటన్ ధర వెయ్యి దాటేసింది.. బోన్లెస్ మటన్ 1250 రూపాయల పైమాటే పలుకుతోంది..
ధరలు పెరిగాయని ఎవరూ వెనక్కితగ్గడం లేదు. పండక్కి బంధుమిత్రుల రాకపోకటంతో విందులు వినోదాలకోసం నాన్వెజ్ వండాల్సిందే. దీంతో రేటు ఎక్కువైనా రాజీపడటం లేదెవరూ. చికెన్, మటన్ పోటీలుపడి పెరుగుతుంటే.. నేనేమన్నా తక్కువా అన్నట్లు చేప రేటు కూడా ఎగిరెగిరి పడుతోంది.
సంక్రాంతి కనుమ రోజు నాన్వెజ్ వంటకాలను ఆరగిస్తుంటారు. కోనసీమలో చేపలకు కూడా ప్రాధాన్యమిస్తుంటారు. సాధారణ రోజుల్లో కిలో చేప ధర 150 నుంచి 200 రూపాయలుంటే.. ఇప్పుడు ఏకంగా 400 నుంచి 500 రూపాయలు పలుకుతోంది. మామూలుగా కిలో నాలుగొందలకు దొరికే పండుగప్ప చేప ధర ఇప్పుడు 700 రూపాయలపైనే ఉంది.
శ్రీకాకుళం సంతల్లో పొట్టేళ్లు, నాటు కోళ్ళ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వారాంతపు సంతలకుతోడు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక సంతలు కూడా కొనసాగుతున్నాయి. కిందటేడాదితో పోలిస్తే పొట్టేళ్లు, నాటు కోళ్ల ధరలు భారీగా పెరిగాయంటున్నారు కొనుగోలుదారులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..