Saffron Flowers: ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లెలో వికసించిన కుంకుమ పువ్వులు

'రెడ్ గోల్డ్' అని పిలవబడే, ఈ కుంకుమపువ్వు ప్రస్తుతం మన దేశంలో జమ్మూ, కాశ్మీర్‌లోని శ్రీనగర్‌తో పాటు, కిష్త్వార్ జిల్లాల్లోని పాంపోర్ ప్రాంతంలోని హిమాలయ పర్వత శ్రేణులలో మాత్రమే పండిస్తున్నారు. దీని ధర అక్షరాలా కేజీ 2 లక్షల రూపాయలు. ఇది ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన ఈ కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు.

Saffron Flowers: ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లెలో వికసించిన కుంకుమ పువ్వులు
Saffron Flower

Edited By:

Updated on: Nov 29, 2023 | 6:40 PM

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలాగా చెప్పుకునే కుంకుమ పువ్వులు విశాఖ మన్యంలో వికసించి గిరిజన ఏజెన్సీకి ఉజ్వల భవిష్యత్‌ను ప్రసాదించాయి. విశాఖ నుండి 100 కిలోమీటర్ల దూరంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో కుంకుమ పెంపకానికి చేసిన ప్రయోజనాలు ఫలించి అవి వికసించాయి.  చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఈ కుంకుమ పంటను పండించడంలో విజయం సాధించారు. ప్రస్తుతం ఈ అత్యంత ఖరీదైన పువ్వులు వికసించి, లోయకు మరింత వన్నె తెస్తున్నాయి.

రెడ్ గోల్డ్‌గా పిలవబడే ఈ పువ్వు ధర కేజీ 2 లక్షల రూపాయలు

‘రెడ్ గోల్డ్’ అని పిలవబడే, ఈ కుంకుమపువ్వు ప్రస్తుతం మన దేశంలో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌తో పాటు, కిష్త్వార్ జిల్లాల్లోని పాంపోర్ ప్రాంతంలోని హిమాలయ పర్వత శ్రేణులలో మాత్రమే పండిస్తున్నారు. దీని ధర అక్షరాలా కేజీ 2 లక్షల రూపాయలు. ఇది ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన ఈ కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. చింతపల్లితో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ పంటకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే ప్రధాన భాగం – ఎర్ర కేసరాలు. ఒక కిలో ఎర్ర కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యముగా పేరు గడించింది. ఈ ఎర్ర కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి. కుంకుమ పువ్వు గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ తెల్లగానో, ఎర్రగానో పుడతుందని ప్రగాఢ నమ్మకం కూడా ఉంది..

కుంకుమ పువ్వు డిమాండ్ 100 టన్నులు కాగా.. ఉత్పత్తి 4.46 టన్నులే

మన దేశంలో కుంకుమపువ్వుకు విపరీతమైన డిమాండ్ ఉంది. భారత దేశంలో 100 టన్నులు డిమాండ్ ఉంటే ఉత్పత్తి మాత్రం 4.46 టన్నులు మాత్రమే. ఇది కూడా జమ్మూ, కాశ్మీర్‌లలో 2,825 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే సాగు అవుతున్న పంట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే కుంకుమపువ్వు వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి 300 టన్నులు మాత్రమే. మన దేశంలోనే దీని వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈ ఖరీదైన కుంకుమపువ్వు సాగు ఉత్పత్తిలో ఇరాన్ ది ఫస్ట్ ప్లేస్ కాగా..  రెండో స్థానంలో స్పెయిన్.. మన భారతదేశం మూడో స్థానంలో ఉన్నాయి.

షేడెడ్ నెట్‌లు, గ్లాస్ హౌస్‌లలో పెంపకం

చింతపల్లి పరిశోధనా స్టేషన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త అయిన ఎం. సురేష్ కుమార్ టీవీ9తో మాట్లాడుతూ
సముద్ర మట్టానికి 1,500 నుండి 2,800 మీటర్ల ఎత్తులో ఉన్న సమశీతోష్ణ పొడి వాతావరణంలో కుంకుమపువ్వు బాగా వృద్ధి చెందుతుందని వివరించారు. పూలు పూయడానికి 17°C ఉష్ణోగ్రత అవసరం ఉంటుందని తెలిపారు. చింతపల్లెలోని ఆర్‌ఎఆర్‌ఎస్‌ను సందర్శించి, కుంకుమ సాగుకు ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసిన మదనపల్లె శ్రీనిధి – పర్పుల్ స్ప్రింగ్స్‌కు చెందిన ప్రముఖ కుంకుమ రైతు నుండి సలహాలు కోరినట్లు ఆయన తెలిపారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో షేడెడ్ నెట్‌లు, గ్లాస్ హౌస్‌లు (కుండలు), బహిరంగ పొలాల్లో వీటిని పెంచుతారని వివరించారు.

షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు – అక్టోబర్ మధ్య మొత్తం 6,500 కుంకుమ విత్తనాలను నాటితే గ్లాస్ హౌస్‌ల విషయంలో అధిక శాతం అంకురోత్పత్తి కనిపించిందన్నారు. తరువాత షేడ్ నెట్, కొంత ఆలస్యంగా బహిరంగ పొలాల్లో పేలవమైన అంకురోత్పత్తి కనిపించిందని, కాబట్టి గ్లాస్ హౌజ్ లోనే ఇది అతి వేగంగా ఉత్పత్తి సాధిస్తుందని సురేష్ కుమార్ టీవీ9తో వివరించారు. ఆగస్టులో షేడ్‌నెట్‌లో వేసిన విత్తనాలు మొలకెత్తాయని తెలిపారు. సెప్టెంబరులో నాటిన విత్తనాలు వికసించటానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. షేడ్ నెట్ విషయానికొస్తే, మొదటి పువ్వు పూయడానికి 87 రోజులు పట్టిందని వివరించారు సురేష్ కుమార్. సెప్టెంబరులో విత్తిన పంటకు మొదటి పువ్వు పూయడానికి 56 రోజులు పట్టడం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…