పాలసీదారు కుటుంబానికి ఊరట.. ఇన్సూరెన్స్ సంస్థకు షాక్! కోటి బీమా మొత్తంతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆదేశం!
HDFC ERGO penalty Telugu: పాలసీదారు మరణం తర్వాత ఆదాయ వివరాలు తప్పుగా ఉన్నాయంటూ బీమా క్లెయిమ్ను తిరస్కరించిన HDFC ఎర్గోకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. పాలసీ మొత్తమైన కోటి రూపాయలను 9% వడ్డీతో పాటు మానసిక వేదన, కోర్టు ఖర్చుల కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

సేవా లోపంతో పాలసీదారు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసినందుకుగాను HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన గుండ్ల మూలయ్య హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో కోటి రూపాయలకు పాలసీ తీసుకున్నారు. 2025 జూలై 28న ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నామిని అయిన ఆయన భార్య ప్రమీల భీమా పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోగా పాలసీ తీసుకునే సమయంలో ఆదాయ వివరాలు తప్పుగా చూపించారు అంటూ సంస్థ తిరస్కరించింది. దీంతో బాధితులు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ని ఆశ్రయించారు.
కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్.. బీమా సంస్థ ఆదాయ ధ్రువీకరణ పత్రంలో తప్పులను నిరూపించడంలో విఫలమైందని గుర్తించింది. సేవా లోపంగా పరిగణించిన కమిషన్ అధ్యక్షులు కరణం కిషోర్ కుమార్, సభ్యులు ఎన్ నారాయణ, ఎస్ నజీ మా కౌసర్.. ఫిర్యాదుదారుకి కోటి మొత్తాన్ని 2025 నవంబర్ 4వ తేదీ నుంచి 9% వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకుగాను 25,000, కోర్టు ఖర్చుల కింద మరో 10 వేలు 45 రోజుల్లోగా చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
