నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా వరకు విస్తరించాయని, అలాగే మరఠ్వాడా ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. వీటి ప్రభావంతో జూన్ 9, సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
జూన్ 10, మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం జిల్లా కొండపిలో 19మిమీ, అనంతపురం జిల్లా బికె సముద్రంలో 15.5మిమీ, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, సంజామలలో14మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..