మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది. ఆదివారం విశాఖ సిటీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్.. ఇవాళ విజయనగరం జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. భోగాపురం, రణస్థలం మీదుగా.. అక్కివలస చేరుకోనున్నారు. చెల్లూరు సభలో సీఎం జగన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
రెండోసారి అధికారమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఆదివారం ఉదయం చిన్నయపాలెం మొదలైన యాత్ర.. ఎండింగ్ పాయింట్ ఎండాడ వరకు అదే విధంగా సాగింది. బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు సీఎం జగన్. నిన్న బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్.. వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మేనిఫెస్టోతో పాటు విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభంకానుంది. సీఎం జగన్ ఎండాడ MVV సిటీ నుంచి బయలుదేరి మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా వారియర్స్తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్. సోషల్ మీడియాలో చేయాల్సిన ప్రచారం, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొనే వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
సాయంత్రం బొద్దవలస మీదుగా విజయనగరం జిల్లా చెల్లూరులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇప్పటికే 21 జిల్లాల మీదుగా కొనసాగిన బస్సు యాత్ర.. రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. అయితే సీఎం జగన్ ప్రతీ రోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా మరో షెడ్యూల్ సిద్ధమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…