
మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమరేంద్ర కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం త్రివేణి అనే యువతితో వివాహం అయింది. వీరికి హర్షవర్థన్, ధర్మాశ్రీ అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా అమరేంద్రకు అప్పులు పెరిగిపోయాయి. సరైన ఉపాధి మార్గం లేకపోవడంతో అప్పులు చేయాల్సి రావడం, వాటిని తీర్చలేకపోవడంతో అమరేంద్రలో ఆందోళన పెరిగిపోయింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ముందు భార్యకు చెప్పకుండా స్నేహితుడి ఇంటికి అని చెప్పి భార్యా పిల్లలను తీసుకొని సంతమాగులూరు వచ్చాడు.
అక్కడ స్నేహితుడి కారు తీసుకొని భార్యాపిల్లలను ఎక్కించుకొని బయలు దేరాడు. ఆ తర్వాత భార్య త్రివేణితో అందరం ఆత్మహత్య చేసుకోవడానికి వెలుతున్నట్లు చెప్పాడు. దీంతో కంగుతిన్న త్రివేణి ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదు. భర్త చెప్పి మాటలు వెన్నులో వణుకు పుట్టించాయి. తెలివిగా తన దగ్గరున్న ఫోన్ లో కుటుంబ సభ్యులకు మెస్పెజ్ చేసింది. ఆ మెస్సెజ్ చూసిన కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. మొదట అసలు ఎక్కడున్నారో వారికి అర్ధం కాలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు త్రివేణి ఫోన్ నంబర్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి.. వాళ్లను ఫాలో అయ్యారు. కారు కర్నూలు–గుంటూరు హైవేలో నర్సరావుపేటకు దగ్గర్లో ఉన్నట్లు గుర్తించి.. ఆ రూట్లోని పోలీసులను అలర్ట్ చేశారు. ఇక కారు నర్సరావుపేట వద్దకు రాగానే అడ్డుకొని కుటుంబ సభ్యులను కిందకు దించారు. దీంతో భార్య త్రవేణి ఊరిపిపీల్చుకుంది. వెంటనే కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారంతా ఒక్కసారిగా కారు ఆపిన ప్రాంతానికి చేరుకున్నారు. అమరేంద్ర కుటుంబాన్ని కాపాడిన పోలీసులు వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.