Watch: ఎవరూ లేని ఇంట్లో అర్థరాత్రి అదేపనిగా వెలుగుతున్న లైట్స్.. తీరా డోర్ ఓపెన్ చేయగా..
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో భారీ చోరీ కలకలం రేపింది. కూతురి పెళ్లికోసం చేయించిన రూ.25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అర్థరాత్రి ఇంట్లోకి దూరిన కేటుగాళ్లు ఎత్తెకెళ్లారు. ఎవరూ లేని ఇంట్లో రాత్రి ఇంట్లో లైట్లు వెలగడంతో అనుమానం వచ్చిన స్థానికులు యజమానికి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

కూతురి పెళ్లికోసం చేయించిన రూ.25లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన పడ్నాడు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉండే మాధవబొట్ల రాధాక్రిష్ణమూర్తి నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ప్రవేటు పాఠశాలలో హిందీ పండిట్ పనిచేస్తున్నారు. దీనితో పాటు పౌరోహిత్యం కూడా చేస్తుంటారు. అయతే ఇటీవలే ఆయన కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. దీంతో పెళ్లి కూతురుకి అవసరమైన బంగారు, వెండి నగలు చేయించి ఇంట్లో ఉంచారు.
అయితే గత నెల 30వ తేదిన పెళ్లి పనుల నిమిత్తం కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఉండగానే ఒకటో తేది అర్ధరాత్రి ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండటాన్ని చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు గమనించారు. వెంటనే రాధాక్రిష్ణమూర్తికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన హుటాహుటిన దాచేపల్లి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగులకొట్టి ఉండటంతో అనుమానం మరింత బలపడింది. లోపలకి వెళ్లి చూడగా బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి.
అయితే బీరువాలో ఉండాల్సిన బంగారు వెండి ఆభరణాలు మాత్రం కనిపించలేదు. దీంతో దొంగతనం జరిగిందని భావించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న గురజాల డిఎస్పీ మహేశ్వరరావు ఘటనా స్థలానికి క్లూస్ టీంతో చేరుకొని ఆధారాలు సేకరించి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బ్రుందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని డిఎస్పీ చెప్పారు. తమ కుమార్తె వివాహం కోసం చేయించిన నగలు, తెచ్చిన నగదు అపహరణకు గురికావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు
ఇదిలా ఉండగా పది రోజుల క్రితమే పల్నాడులోని కారంపూడిలోనూ పట్టపగలు ఓ బంగారు ఆభరణాల వ్యాపారి వద్ద నుండి బ్యాగ్ లాక్కొని కోటి రూపాయల నగలు దోచుకుపోయారు కొందరు కేటుగాళ్లు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మరో చోరీ కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇలా వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పల్నాడు వాసులు బెంబెలెత్తిపోతున్నారు. పోలీసులు చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
