Onion Farmer: ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావొద్దు.. కీలక ప్రకటన చేసిన అధికారులు.. అసలు కారణం ఏంటంటే..

ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావద్దు.. ఇదీ కర్నూలు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్న మాట. ఉల్లి కొనేవారు వారు లేక ధరలు పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు.

Onion Farmer: ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావొద్దు.. కీలక ప్రకటన చేసిన అధికారులు.. అసలు కారణం ఏంటంటే..
Onion Farmers

Updated on: Aug 21, 2021 | 8:46 AM

Onion Farmers Struggles: ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావద్దు.. ఇదీ కర్నూలు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్న మాట. ఉల్లి కొనేవారు వారు లేక ధరలు పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. దేశ, విదేశాలకు ఎగుమతి అయ్యే కర్నూలు ఉల్లి మార్కెట్ రెండు వారాలైనా తెరుచుకోలేదు. పండించిన పంటను అమ్ముకోలేని స్థితిలో ఉన్న ఉల్లి రైతు కంట కన్నీరు చూసి ఎవరు కనికరించడం లేదు. అసలు పంటను మార్కెట్లోకి తీసుకురావద్దని అధికారులు మొండి కేశారు.

ఒకే దేశం ఒకే మార్కెట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యి పైగా మార్కెట్లలో ఆన్‌లైన్ ట్రేడింగ్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్-ENAM ద్వారా పంటలు కొనాలని దేశవ్యాప్తంగా ఆదేశాలున్నాయి. ఏపీలో 33కి పైగా ప్రధాన మార్కెట్లలో ఈనామ్ వ్యాపారం జరుగుతుంది. కర్నూలు మార్కెట్‌ ఉల్లికి తప్ప మిగతా పంటలకు ఈ-నామ్ పద్ధతి ద్వారానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కానీ ఉల్లి పంటను మాత్రం బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు.

మార్కెట్‌కు వచ్చిన పంట నేరుగా చూసి పరిశీలించిన తర్వాత వ్యాపారులంతా గుమికూడి ఎవరు ఎక్కువ వేలం పాడితే ఆ వ్యాపారికి రైతు పంటను విక్రయిస్తాడు. ENAM పద్ధతిలో ఏ వ్యాపారి ఎంత కొనుగోలు చేయగలడో ఆన్‌లైన్‌లో టెండర్ వేయాలి. దీని ద్వారా అమ్మకం దారులకు కొనుగోలుదారులకు మధ్యవర్తులు ఉండరు. దీంతో రైతుకు అదనపు ఖర్చు తగ్గుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, కర్నూలులో మాత్రం వ్యాపారులు ఈనామ్ పద్ధతి అంగీకరించడం లేదు. బహిరంగ వేలం ద్వారానే కొనుగోలు చేస్తాం, దీనిద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ-నామ్ అమలుచేసి తీరాలని అధికారులు అంటుంటే.. లేదు బహిరంగ వేలంలో మాత్రమే కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు మంకు పట్టు వీడటం లేదు.

ఇదిలావుంటే, వ్యాపారులు ఈ-నామ్ ద్వారా కొనుగోలు చేసే వరకు రైతులు పంటను మార్కెట్‌కు తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఈ ఆదేశాలు రైతులకు శాపంగా మారాయి. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేశారు. రైతుల అవసరాలను పెట్టుబడిగా మలచుకుంటున్నారు. మార్కెట్లో క్వింటాల్ ధర 1800 రూపాయలు ఉంటే వ్యాపారులు 1200 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు. కొందరు రైతులు దిక్కులేక అమ్ము కుంటుండగా మరికొందరు తాడేపల్లి మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. రవాణా ఖర్చులు రైతులకు అదనపు భారమవుతున్నాయి.

Read Also…  Naxals Attack: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. భద్రతా దళాలపై దాడి.. అసిస్టెంట్‌ కమాండెంట్‌‌తో సహా ఇద్దరు మృతి

Loading...
Unable to load recommendations.
Follow Us