
ఒంగోలు, జనవరి 26: ఒంగోలులో భారత గణతంత్ర దినోత్సవాల సందర్బంగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి సరదాగా రైఫిల్ పట్టుకుని షూటింగ్ మూడ్లోకి వెళ్ళారు. భద్రతా దళాలు ప్రదర్శించిన తుపాకుల స్టాల్ దగ్గరకు వెళ్ళిన ఎంపి ఓ పోలీస్ దగ్గర ఉన్న స్నిపర్ రైఫిల్ను పట్టుకుని గురి చూశారు. పక్కనే కలెక్టర్, ఎస్పీలు ఉండగా రైఫిల్ను పట్టుకుని ఎంపీ మాగుంట గురి చూడటాన్ని ఆందరూ ఆసక్తిగా గమనించారు. ఈసారి ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్, సిట్గింగ్ ఎంపీ మాగుంటకు లేదన్న ప్రచారం జోరుగా జరుగుతుతోంది. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న మాగుంట తుపాకీని ఎక్కుపెట్టడంతో.. ఆ బుల్లెట్ ఎటువైపు దూసుకెళుతుందోనంటూ అక్కడే ఉన్న కొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం ఆశక్తిగా మారింది. మాగుంట తూటా ఈసారి వైసీపీ నుంచా.. లేక టీడీపీ నుంచా అంటూ ఛలోక్తులు విసురుకున్నారు.
మాగుంటకు ఈసారి వైసీపీ నుంచి టికెట్ ఇచ్చేది లేని అధిష్టానం కరాఖండిగా చెప్పేసిందంటూ ఒకవైపు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాగుంటకే వైసీపీ టికెట్ ఇప్పించుకునేందుకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒంగోలులో జరిగిన వైసీపీ ర్యాలీలో కూడా మాగుంటకు వైసీపీ ఎంపీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నిస్తున్నట్టు బాలినేని తెలిపారు. ఈ తరుణంలో మాగుంటకు వైసీపీ నుంచి అవకాశం లేకుంటే టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్నారని ప్రచారం నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో మాగుంట పయనం ఎటువైపు తేలిపోతుందని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా గణతంత్ర దినోత్సవాల్లో మాగుంట తుపాకీ ఎక్కుపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..