Andhra News: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన 10 రోజులకే..
ఆ ఇంట్లో పది రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఇంట్లో ఇంకా పెళ్లి సందడి ముగియనే లేదు.. పెళ్లయ్యాక కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో దైవదర్శనానికి వెళ్లిన ఆ నవవరుడిని తలంబ్రాల తడి ఆరకముందే విధి వెక్కిరించింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోనే దారికాచిన మృత్యువు.. అతన్ని ఇంటికి చేరకుండానే తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై నవ వరుడి ప్రాణాలు కోల్పోయిన గటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నందవరం మండలం కప్పట్రాల గ్రామానికి చెందిన 12 మంది ఇటీవల మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకొని ఉదయం ఆటోలో స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. ముగతి సమీపంలో కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయిన ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 ఏళ్ల రంగడు అనే యువకుడు ఆటో కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేవలం 10 రోజుల క్రితమే వివాహం చేసుకున్న రంగడు కన్నుమూయడంతో నవ వధువు, మిగతా కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సురేంద్రతో పాటు రెండేళ్ల చిన్నారి భరత్కు తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న నవ వధువుతో పాటు మరో 9 మంది స్వల్ప గాయాలతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ విషాద ఘటనతో పది రోజుల క్రితం పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట ఇప్పుడు చావు డప్పు మోగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో తీరని శోకాన్ని నింపింది. కొత్త జీవితం స్టార్ట్ చేసి భాగస్వామితో నిండు నూరెళ్లు బ్రతకాలని అనకున్న రండగి ఆశలన్నీ అడియాశలైపోయాయి. పెళ్లై 10 రోజులకే కట్టుకున్న వాడిని కోల్పోయిన ఆ యువతి కూడా ఇప్పుడు తోడులేని నీడలా మిగిలిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
