పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా అభినందించారు. వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు,నాయకులకు సెల్యూట్ అంటూనే.. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పుకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన గ్రాడ్యుయేట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసన మండలికి వెళుతున్న వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం. మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం.#ByeByeJaganIn2024pic.twitter.com/siiKPixjz1
అలాగే అంతకముందు తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన 3 చోట్ల కూడా.. ఆయా స్థానాలు టీడీపీ సొంతమయ్యాయి.