
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం గ్రామంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో గ్రామంలో ఆందోళన, ఉత్కంఠ మరింత పెరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
సుంకర గణేష్ భవాని దంపతులు 20 ఏళ్లుగా సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలాదారులుగా జీవనం సాగిస్తున్నారు. చుట్టూ కొండలు, తోటల మధ్య ఉన్న ఒకే ఒక్క ఇంట్లో ఈ కుటుంబం నివసిస్తోంది. రెండేళ్ల జ్ఞానేశ్వరి, మరో ఏడు నెలల చిన్నారితో కలిసి కుటుంబం అక్కడే ఉంటోంది. గణేష్ దంపతులది ప్రేమ వివాహం. కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవని చెబుతున్నారు. పాప తోటలో అటూ ఇటూ తిరగడం తప్ప ఎప్పుడూ ఇంటి పరిసరాలు దాటివెళ్లలేదని తల్లి చెబుతోంది.. అలాంటిది ఒక్కసారిగా పాప ఎలా అదృశ్య మైందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
వీరు ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఒక కొండ ఉంది. ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. రెండేళ్ల చిన్నారి ఒంటరిగా వెళ్లగలదా..? కొండ ఎక్కడం సాధ్యమా..? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. పాపతో పాటు కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. పోలీసుల సహాయంతో కొండ ప్రాంతాలు, పామాయిల్ తోటలు, అటవీ పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నప్పటికీ ఇప్పటివరకు చిన్నారి ఆచూకీ లభించలేదు. ఆమె వేసుకున్న దుస్తులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్క పోవడంతో చిన్నారి నిజంగా ఆ ప్రాంతంలోనే ఉందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు… చివరగా శనివారం ఉదయం 11 గంటలకు పొలాల్లో ఉన్న సీసీ కెమెరాలో చిన్నారి, వారి పెంపుడు కుక్క పరుగులు పెడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు.. ఈ పాప గురించి సమాచారం అందించిన వారికి లేదా ఆచూకీ తెలిపిన వారికి రూ. 1,00000 (అక్షరాలా ఒక లక్ష రూపాయలు) నగదు బహుమతి అందజేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనతో అగ్రహారం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..