తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.. స్వామివారు జగదేకమోహనుడు.. ఆ దివ్య స్వరూపాన్ని చూసేందుకు వేయి కళ్లయినా చాలవు.. ఆ మంగళమూర్తిని ఎంతసేపు చూసినా తనివి తీరదు.. ఇక ఆ జగదానందకారకుడు మోహినీ అవతారంలో ఉంటే ఏం చెప్పేది? చూపు తిప్పుకోగలమా? ఆ సమ్మోహనంలో చిక్కుకుపోమూ! మోహినీ అవతారంలో దర్శనమిస్తున్నప్పుడు స్వామివారిని తిలకిస్తే అదే జరుగుతుంది.. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మధిస్తున్న వేళ స్వామివారు మోహినీగా ఉద్భవించారు.. కరోనా కారణంగా ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు.. మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ ఆలయంలోనే నిర్వహిస్తున్నారు.. ఎప్పటిలాగే అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణల మధ్య, మంగళవాయిద్యాలు నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు..