
వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రాష్ట్రంలో చెత్త ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పులు చేసినా.. ఆ నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్నారు బాలయ్య. ఏపీలో డ్రగ్ , ల్యాండ్ మాపియాలు పెరిగిపోయాయని ఆయన ఫైర్ అయ్యారు. జనంపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించిన బాలకృష్ణ.. రాష్ట్ర ప్రభుత్వానిది సైకో మనస్థత్వంగా కామెంట్స్ చేశారు. తాను సైకాలజీ చదవకపోయినా.. తనకు మించిన సైక్రియాట్రిస్ట్ లేరన్నారు బాలకృష్ణ.
వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని ఆరోపించారు బాలకృష్ణ. పెద్దసంఖ్యలో సలహాదారులను పెట్టుకున్నా.. వాళ్ల సలహాలను వినే పరిస్థితిలో సీఎం జగన్ లేరన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. టీడీపీ నేతలతోపాటు పాదయాత్రలో కలిసి నడిచారు.
లోకేష్ యువగళంలో స్పెషల్ ఎట్రాక్షన్గా మారారు బాలకృష్ణ. మామ అల్లుడు ఇద్దరూ కలిసి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అయితే అది మాటల్లో కాకుండా ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. పాదయాత్రకు తరలివచ్చిన విద్యార్థులతో కలిసి లోకేష్, బాలకృష్ణలు.. ప్లకార్డులు చేతబట్టారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డ లింక్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది.. ప్రతీ గంజాయి కేసులో వైసీపీ నేత లింకు దొరుకుతుందన్న ప్లకార్డుల్ని ప్రదర్శించారు. అనంతరం అల్లుడితో కలిసి మామ పాదయాత్ర కొనసాగించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..