Andhra Pradesh: రెండెకరాల నుంచి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు.. చంద్రబాబుపై మంత్రి ఉషశ్రీ ఫైర్..

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ వాడివేడిగా నడుస్తోంది. ఎవరికి వారే తగ్గేదే లే అన్న తీరుతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో మంత్రి ఉషాశ్రీ చరణ్‌పై చంద్రబాబు చేసిన భూ కబ్జా ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి... రెండు ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని చంద్రబాబును ప్రశ్నించారు.

Updated on: Sep 08, 2023 | 9:39 AM

ఏపీలో అటు చంద్రబాబు పర్యటనలు, ఇటు లోకేష్‌ పాదయాత్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. టీడీపీ అగ్రనేతలు ఎక్కడి వెళ్లిన అక్కడి స్థానిక ఎమ్మెల్యే, మంత్రులను టార్గెట్‌ చేస్తున్నారు. సంచలన ఆరోపణలతో రాజకీయ వేడి పుటిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు తనపై చేసిన ఆరోపణకు మంత్రి ఉషాశ్రీచరణ్‌ రియాక్ట్‌ అయ్యారు. చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఆస్తులు పేదలకు పంచుతారా?.. అలా చేస్తే నేను కొనుగోలు చేసిన భూములు కూడా పంచేందుకు రెడీ అన్నారు. తనది సంపన్న కుటుంబమని పేర్కొన్న మంత్రి.. తాను భూములు కొంటే తప్పా అంటూ ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారని చంద్రబాబును మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రశ్నించారు.

ఇటీవల అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించిన చంద్రబాబు మంత్రి ఉషా శ్రీ చరణ్ కబ్బాలపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో అన్నీ కబ్జాలు, సెటిల్‌మెంట్లేనని ఆరోపించారు. 168 ఎకరాలు తక్కువ ధరకే మంత్రి లాక్కున్నారన్నారు. లే అవుట్ వేస్తే డబ్బులియ్యాల్సిందేనని తెలిపారు. మంత్రి కొట్టేసిన 168 ఎకరాలకు తాను డబ్బు ఇస్తానని, తిరిగిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ సవాల్ విసిరారు. అంతకుముందు కూడా మంత్రి ఉషశ్రీ చరణ్‌ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కళ్యాణదుర్గానికి ఏం చేశారంటూ ఫైర్ అయ్యారు.

160 ఎకరాల భూమి కొనుగోలు చేసింది నిజమేనని పేర్కొన్న ఉషశ్రీ చరణ్.. భయపడి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమది పుట్టుకతోనే జమీందార్‌ కుటుంబమని.. భూములు కొంటే తప్పేంటి అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్‌ చంద్రబాబుపై మండిపడ్డారు. హెరిటేజ్‌ ఆస్తులు పంచితే మా ఆస్తులు పంచుతామని.. చంద్రబాబు మొదలుపెట్టిన రోజే పేదలకు ఇస్తానంటూ ఉషశ్రీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us